హైదరాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ప్రపంచ ఏరోస్పేస్ కు తెలంగాణ కేరాఫ్ గా మారనుందని అన్నారు. తెలంగాణ నుంచి ఇంజనీరింగ్ వస్తువుల ఎగుమతుల్లో 117.9 శాతం భారీ వృద్ధి నమోదైందని, ఇది దేశంలోనే అత్యధికమని రేవంత్ రెడ్డి హైలైట్ చేశారు. భారతదేశపు మొట్టమొదటి ప్రైవేటుగా అభివృద్ధి చేసిన ఆర్బిటల్ రాకెట్ అయిన స్కైరూట్ ఏరోస్పేస్ వారి విక్రమ్-1 ఫ్లైట్ హార్డ్వేర్ను శనివారం ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఏరోస్పేస్ రంగంలో ప్రపంచ నాయకుడిగా అవతరించాలన్న తెలంగాణ ప్రయత్నంలో ఈ సందర్భం ఒక కీలక మైలురాయి అని ముఖ్యమంత్రి అన్నారు. ఈ జెండా ఊపి ప్రారంభించే కార్యక్రమంతో, శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో ఉన్న ప్రయోగ స్థలానికి రాకెట్ లాంఛనంగా బయలు దేరింది. స్కైరూట్ రాబోయే నెలల్లో భారతదేశపు మొట్ట మొదటి ప్రైవేట్ కక్ష్య ప్రయోగ ప్రయత్నం చేయడానికి సిద్ధంగా ఉండడం ఆనందంగా ఉందన్నారు సీఎం.
ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్కైరూట్ బృందాన్ని అభినందిస్తూ, ఈ రాకెట్ను పూర్తిగా హైదరాబాద్లోనే రూపొందించి, అభివృద్ధి చేయడం చాలా గర్వకారణమని ముఖ్యమంత్రి అన్నారు. ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకు వెళ్లడానికి స్కైరూట్ భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్గా నిర్మించిన కక్ష్య రాకెట్ను అభివృద్ధి చేసిందన్నారు. ఈ సంస్థ 2022లో తన మొదటి రాకెట్ను ప్రయోగించింది, ఇంత తక్కువ సమయంలో కక్ష్య ప్రయోగ దశకు చేరుకోవడం ఒక అద్భుతమైన విజయం అని పేర్కొన్నారు. ఏరోస్పేస్ రంగంలో తెలంగాణ భారతదేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉందని అన్నారు రేవంత్ రెడ్డి.
