తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుంది
సంచలన ప్రకటన చేసిన పార్టీ చీఫ్ చంద్రబాబు నాయుడు
అమరావతి : ఈ లోకం ఉన్నంత దాకా తెలుగు జాతి ఉంటుందని , తెలుగు జాతి కలకాలం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ వెలుగుతూనే ఉంటుందని ప్రకటించారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో నూతన పార్టీ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ సందర్బంగా చంద్రబాబు ప్రసంగించారు. నాలుగు దశాబ్దాల నుంచి పార్టీ కమిటీలపై కసరత్తు చేశాననని, కానీ ఈ స్థాయిలో కసరత్తు ఎప్పుడూ చేయ లేదని అన్నారు. ఎన్నో వడపోతలు, వ్యూహాలతో నూతన కమిటీలను ఏర్పాటు చేశాం అని చెప్పారు. సీనియర్లను గౌరవిస్తూ… కొత్తవారికి అవకాశాలు ఇస్తూ.. కష్టపడిన వారికి చోటు కల్పిస్తూ కమిటీలను ఏర్పాటు చేశాం అన్నారు . తెలుగుదేశం కార్యకర్తలు ఎప్పుడూ మీసం మేలేస్తారని, ఎవ్వరికీ తలవంచరని పేర్కొన్నారు .
కార్యకర్తే అధినేత అనేది నినాదంగా కాదు… విధానంగా మార్చుకున్నాం అని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు. ఓ మండల పార్టీ అధ్యక్షురాలికి.. క్లస్టర్ ఇన్ఛార్జికి పొలిట్ బ్యూరోలో స్థానం కల్పించడం జరిగిందన్నారు . మహిళలకు ఎక్కువగా అవకాశాలిచ్చాం… మహిళా బిల్లుకు పూర్తిగా మద్దతిచ్చాం అన్నారు. చదువుకున్న వారికి మంత్రి పదవులిచ్చి ప్రొత్సహించాం అని తెలిపారు . రామ్మోహన్నాయుడు, శబరి, రాజేష్ వంటి వారిని జాతీయ ఉపాధ్యక్షులుగా నియమించాం అన్నారు చంద్రబాబు నాయుడు.ప్రతిపక్షంలో లోకేష్ చాలా కీలక పాత్ర పోషించారు. ట్రైనింగ్ క్లాసులు మొదలుకుని… కార్యకర్తల సంక్షేమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారంటూ ప్రశంసలు కురిపించారు. 20 లక్షల మందికి ఉద్యోగాలిస్తామనే హామీని నెరవేర్చేందుకు లోకేష్ కృషి చేస్తున్నారని అన్నారు.
