న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఈ ఏడాది రాష్ట్రంలో జరిగిన శాసన సభ ఎన్నికలలో ఊహించని రీతిలో టీఎంసీ ఓటమి పాలైంది. భారతీయ జనతా పార్టీ భారీ మెజారిటీని సాధించి అధికారంలోకి వచ్చింది. సువేందు అధికారి ముఖ్యమంత్రిగా కొలువు తీరారు. ఒకప్పుడు తను టీఎంసీ పార్టీ అధ్యక్షురాలు, మాజీ సీఎం మమతా బెనర్జీకి అనుంగు అనుచరుడిగా ఉన్నారు. ఆ తర్వాత బీజేపీ ఆపరేషన్ లో తను కీలకంగా వ్యవహరించాడు. చెప్పి మరీ మమతా బెనర్జీకి కోలుకోలేని షాక్ ఇచ్చాడు. ఈ ఆపరేషన్ వెనుక ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా. ప్రస్తుతం టీఎంసీ పార్టీ రెండుగా చీలింది. అసలైన పార్టీ ఎవరిదనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
ఈ తరుణంలో టీఎంసీ తరపున పోటీ చేసి గెలుపొందిన వారిని బీజేపీలోకి రప్పించేందుకు ప్లాన్ చేసింది. ఆపరేషన్ ఆకర్ష్ వర్కవుట్ అయ్యింది. తమ పార్టీ పై గెలుపొందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి తిరిగి పోటీ చేయాలని టీఎంసీ ఎంపీలు మహూవా మోయిత్రా, సాగరికా ఘోష్ లు డిమాండ్ చేశారు. ఈ ఇద్దరు ఎంపీలు మొదటి నుంచీ మమతా బెనర్జీకి, పార్టీకి విధేయులుగా ఉన్నారు. పార్టీ చీఫ్ తరపున తమ గొంతు వినిపిస్తూ వచ్చారు. మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ గురించి కూడా మహువా మొయిత్రా ప్రత్యేకంగా ప్రస్తావించారు. పార్టీ గుర్తుతో గెలుపొంది ఇప్పుడు బీజేపీ తరపున ప్రచారం చేస్తామంటే ఎలా అని ప్రశ్నించారు.