చెన్నై : తమిళనాడు రాజకీయ చరిత్రలో అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. కొత్తగా కొలువు తీరిన టీవీకే పార్టీలో అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యత ఉంటుందని ఇప్పటికే స్పష్టం చేశారు పార్టీ చీఫ్ , సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. ఆయన ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకున్నారు. ఇండియన్ ముస్లిం లీగ్ కు చెందిన షాజహాన్ కు మంత్రివర్గంలో చోటు కల్పించారు. అంతే కాదు గత కొన్నేళ్లుగా ప్రజల గొంతుకగా ఉన్న వీసీకే పార్టీకి చెందిన వన్ని అరసు ఇవాళ కేబినెట్ బెర్త్ దక్కించుకున్నారు. ఆయన గత కొన్ని సంవత్సరాలుగా ప్రజల కోసం పని చేస్తూ వస్తున్నారు. ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆయనకు అత్యంత కీలకమైన సామాజిక న్యాయ శాఖ అప్పగించడం విశేషం.
తాజాగా రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో తిండివనం శాసన సభ నియోజకవర్గం నుంచి వీసీకే పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందారు వన్ని అరసు. ఆయనకు సాంఘిక , సామాజిక న్యాయ శాఖతో పాటు గిరిజన సంక్షేమ శాఖ కూడా అప్పగించడం విస్తు పోయేలా చేసింది. వన్ని అరసు దళితులు, సామాజిక న్యాయం, అణగారిన వర్గాల హక్కులపై గట్టిగా మాట్లాడే నాయకుడిగా గుర్తింపు పొందారు. తమ పార్టీ తరఫున ఆయన తమిళ సమాజ సమస్యలపై చురుకుగా స్పందిస్తుంటారు.
వన్ని అరసు 1971లో పుట్టాడు. తమిళనాడుకు చెందిన రాజకీయ నాయకుడు. రచయిత కూడా గుర్తింపు పొందారు . దళితులు, ఇతర అణగారిన వర్గాల హక్కుల కోసం వాదించే ‘విదుతలై చిరుతైగళ్ కచ్చి’ అనే రాజకీయ పార్టీకి డిప్యూటీ జనరల్ సెక్రటరీగా పని చేస్తున్నారు. ఆయన తోల్. తిరుమావళవన్కు సన్నిహితుడు. తమిళ జాతీయవాదానికి, ఈలం తమిళ ఉద్యమానికి గట్టి మద్దతు ఇవ్వడంలో ప్రసిద్ధి చెందారు.