వాషింగ్టన్ : అమెరికాలో విదేశీ విద్యార్థులు, జర్నలిస్టులు ఎంత కాలం చదువు కోవచ్చు లేదా పని చేయవచ్చనే దానిపై కఠినమైన పరిమితులు విధించే ట్రంప్ పరిపాలన విధానం అమలును అమెరికా ఫెడరల్ న్యాయమూర్తి వాయిదా వేశారు. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) నుండి కొత్త వీసా నిబంధనలు అమల్లోకి రావడానికి ఒక రోజు ముందు జిల్లా న్యాయమూర్తి డెన్నిస్ సేలర్ ఈ తాత్కాలిక ఉత్తర్వు జారీ చేశారు. ప్రతిపాదిత కొత్త నిబంధనల ప్రకారం, విద్యార్థి వీసాలపై ఉన్న విదేశీయులను గరిష్టంగా నాలుగేళ్ల వరకు అనుమతిస్తారు, ఆ తర్వాత వారు పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అంతర్జాతీయ విద్యార్థులను ఇంతకు ముందు వారి చదువు పూర్తయ్యేంత వరకు ఉండటానికి అనుమతించేవారు.
విదేశీ జర్నలిస్టులు కేవలం 240 రోజులు, అంటే సుమారు ఎనిమిది నెలల పాటు మాత్రమే ఉండటానికి పరిమితం చేయబడతారు, కానీ అదే కాలపరిమితికి పొడిగింపుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటి వరకు వారు ఐదు సంవత్సరాల వరకు ఉండగలిగే వారు. చైనా జర్నలిస్టులకు కేవలం 90 రోజులు మాత్రమే లభిస్తాయి, మరో 90 రోజుల పొడిగింపులతో. విశ్వ విద్యాలయాలు, ఉపాధ్యాయులు , జర్నలిస్టులకు ప్రాతినిధ్యం వహిస్తున్న యూనియన్ల కూటమి వీసా ఆంక్షలను సవాలు చేస్తూ ఒక దావాను దాఖలు చేసింది. కేసు యోగ్యతలపై తీర్పు ఇవ్వకుండా కొత్త డీహెచ్ఎస్ నిబంధనల అమలును ప్రస్తుతానికి నిలిపివేసి, అక్టోబర్ 2న మరో విచారణను షెడ్యూల్ చేశారు. అంతర్జాతీయ విద్యార్థులు , జర్నలిస్టులపై వీసా ఆంక్షల గురించి న్యాయమూర్తి సందేహం వ్యక్తం చేశారు. ప్రస్తుత వ్యవస్థ పది కోట్ల మంది విదేశీ విద్యార్థులను యునైటెడ్ స్టేట్స్కు రావడానికి అనుమతించిందని, దీని ఫలితంగా సైన్స్, మెడిసిన్ , టెక్నాలజీలో అద్భుతమైన పరిశోధనలు, గణనీయమైన ఆర్థిక వృద్ధి , అనేక ఇతర ప్రయోజనాలు లభించాయని ఆయన అన్నారు.