హైదరాబాద్ : తెలంగాణలో విద్య, పట్టణ పునరుద్ధరణ, సామాజిక ఆరోగ్యం, మహిళా నేతృత్వంలోని అభివృద్ధి , ఉపాధి కల్పన వంటి రంగాలలో అగా ఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ చేపట్టిన బహుముఖ అభివృద్ధి కార్యక్రమాలను గవర్నర్ శివ్ ప్రతాప్ కుమార్ శుక్లా ప్రశంసించారు. తెలంగాణ గొప్ప కళా వారసత్వాన్ని ప్రతిబింబించేలా, గ్రామీణ తెలంగాణ జీవనశైలిని తెలిపే ‘చెరియల్ నకాషీ’ చిత్రాన్ని , అందమైన హంస ఆకృతితో రూపొందించిన ‘కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ వీణ’ను గవర్నర్ ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్ కి బహూకరించారు. షియా ఇస్మాయిలీ ముస్లింల 50వ వంశ పారంపర్య ఇమామ్ , అగా ఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ చైర్మన్ అయిన ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారత్ , తెలంగాణలో తన తొలి అధికారిక పర్యటనలో భాగంగా హైదరాబాద్లోని ‘లోక్ భవన్ లో గవర్నర్ ను మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా గవర్నర్ ఆగా ఖాన్ సంస్థ చైర్మన్ లు గంటకు పైగా వివిధ అంశాలపై చర్చలు జరిపారు. విద్య, ఆరోగ్యం, పట్టణాభివృద్ధి , సామాజిక సంక్షేమ రంగాలలో తెలంగాణ ఆగా ఖాన్ సంస్థ సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని గవర్నర్ పిలుపునిచ్చారు. ఆగా ఖాన్ భారతదేశానికి అందించిన విశేష సేవలను, సంస్థ చేపట్టిన పనులను గుర్తు చేసుకున్నారు. దివంగత అగా ఖాన్ -4 2015లో ‘పద్మ విభూషణ్’ పురస్కారం లభించిందని , భారతదేశంలో ఆయనకు ఎంతో గౌరవం ఉండేదని గవర్నర్ పేర్కొన్నారు.” శివ్ ప్రతాప్ శుక్లా ‘అగా ఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్’తో హైదరాబాద్కు ఉన్న దీర్ఘకాలిక అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పునరుద్ధరించబడిన కుతుబ్ షాహీ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం కోసం జూలై 2024లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్ – వి హైదరాబాద్ను సందర్శించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఆ ట్రస్ట్ చేపట్టిన సంరక్షణ , ల్యాండ్స్కేప్ అభివృద్ధి పనులను ‘ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యానికి’ ఒక గొప్ప ఉదాహరణగా ఆయన అభివర్ణించారు.
