అమరావతి : ఏపీ రాష్ట్ర బీసీ, సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత సంచలన కీలక ప్రకటన చేశారు. శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. చేనేత రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు నూతన టెక్స్ టైల్స్ పాలసీని రూపకల్పన చేశారని మంత్రి చెప్పారు. ఈ పాలసీ ద్వారా రాష్ట్రంలో రూ.10 వేల కోట్ల పెట్టుబడులు రాబట్టే చర్యలు తీసుకుంటున్నామన్నారు. నూతన పాలసీతో చేనేత రంగంలో రెండు లక్షల మందికి ఉపాధి కల్పించాలన్నది ప్రధాన ఉద్దేశమన్నారు. చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసి చేనేత వస్త్రాల అమ్మకాలను పెంచామన్నారు ఎస్. సవిత. ఈ కామర్స్ లోనూ చేనేత అమ్మకాలు చేస్తున్నామని, ఆన్ లైన్ సేల్స్ ద్వారా అమ్మకాలు మరింత పెరిగాయని తెలిపారు. గత ప్రభుత్వంలో నేతన్న భరోసా పథకం మాత్రమే అమలు చేసి చేతులు దులుపుకుందని ఆరోపించారు.
ఈ పథకం అమలులో అర్హత లేని వైసీపీ కార్యకర్తలకు 40 వేల మందికి లబ్ధి చేకూర్చారని మంత్రి సవిత మండిపడ్డారు. దీనివల్ల ఆప్కోలో అమ్మకాలు గణనీయంగా పెరిగాయన్నారు. చేనేత వస్త్రాల అమ్మకాలు మరింత పెరిగేలా టాటా, తనేరియా, బిర్లా సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నామన్నారు ఎస్. సవిత. వస్త్రాల తయారీలో నేతన్నల స్కిల్ పెరిగేలా బాపట్ల, గుంటూరు, తూర్పు గోదావరి, తిరుపతి, సత్యసాయి జిల్లాల్లో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. గతంలో జగన్ రెడ్డి వైసీపీ పాలనలో చేనేత రంగాన్ని నిర్వీర్యం చేశారని ఆరోపించారు. కానీ తాము వచ్చాక చేనేత రంగానికి పూర్వ వైభవాన్ని తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు ఎస్. సవిత.
