Anantapuram : మీరు ఇక్కడ.. మీ పిల్లలు మాత్రం అక్కడా?
Anantapuram : ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు సైతం తమ పిల్లలని తమ పాఠశాలలో చేర్పించరెందుకు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు తయారవుతున్న తరుణంలో కూడా
Anantapuram : ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు సైతం తమ పిల్లలని తమ పాఠశాలలో చేర్పించరెందుకు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు తయారవుతున్న తరుణంలో కూడా ఆదిశగా ఎందుకు ఆలోచించరంటూ కలెక్టరు గంధం చంద్రుడు ప్రభుత్వ ఉపాధ్యాయులను నిలదీయటంతో వారంతా అవాక్కయ్యారు. అనంతపురంలోని అంబేడ్కర్ భవనంలో ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు,మండల విద్యాశాఖాధికారులు తో జరిగిన నాడు నేడు సమీక్షలో పాల్గొన్న ఆయన టీచర్లుగా కాకుండా తల్లిదండ్రులుగా సమాధానం ఇవ్వాలంటూ వారికి పలు ప్రశ్నలు సంధించారు.
ఉపాధ్యాయుల పిల్లలు ఎక్కడెక్కడ చదువుకుంటున్నారు. వాటిలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు ఎన్ని? ఇలా కలెక్టరే స్వయంగా ప్రశ్నించడంతో జవాబు చెప్పలేక నీళ్లు నమలాల్సిన పరిస్థితి ఉపాధ్యాయులకు వచ్చింది. కలెక్టరు వేసిన ప్రశ్నలకు పలువురు ఉపాధ్యాయులు సమాధానం ఇస్తూ.. మౌలిక సదుపాయాలు, అంకితభావం లేకపోవడం, సిలబస్ అమలులో లోపం, ఎక్కువమంది విద్యార్థులు, తక్కువ టీచర్లు ఉండటం, ఇంగ్లిష్ మీడియం లేకపోవడం తదితర కారణాలు చెప్పుకొచ్చారు.
వీటన్నింటినీ కలెక్టర్ కొట్టి పారేసారు. ప్రభుత్వ జీతాలు తీసుకునే మీరే అంకితభావం లేదనటం సరికాదని, ప్రయివేటు స్కూళ్లలో మీ పిల్లలను చేర్పించి విద్యార్దులు ఎక్కువమంది ఉన్నారనటం సహేతుకమా? అని నిలదీసారు. ఇంగ్లీష్ మీడియం లేక పోవటమే కారణం అని చెప్పిన ఉపాధ్యాయులకు మీరు ఏ మీడియంలో చదువుకుని ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఇంగ్లీష్ మీడియం తీసుకువచ్చేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని, అందుకు ఉపాధ్యాయుల కృషి కూడా ఉండాలని సూచించారు.
మార్పు ఇప్పటి నుంచే ఎందుకు తీసుకురాకూడదు అంటూఉపాధ్యాయులను ప్రశ్నించారు. మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం ద్వారా అందరికీ ఆదర్శంగా నిలవండని అన్నారు.
కలెక్టర్ చెపుతున్న మాటలతో ఉపాధ్యాయవర్గాలలో చర్చ జరుగుతోంది. మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో ఎందుకు చేర్పించడం లేదంటూ నిలదీయటంతో ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్లలని కచ్చితంగా ప్రభుత్వ పాఠశాలకే పంపాలని, లేని పక్షంలో జీతం కోత విధిస్తామని ప్రభుత్వమే ఓ ఆర్డర్ జారీ చేస్తే బాగుంటుందన్న మాట సమావేశంలో వినిపించడం విశేషం,
