Bandi Sanjay : ప్రాణం పోయినా సరే పాదయాత్ర చేస్తా – బండి
సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగిన బీజేపీ చీఫ్
Bandi Sanjay : కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. భైంసాకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంపై తీవ్రంగా మండిపడ్డారు.
ఆయనను అక్కడికి వెళ్లకుండా అదుపులోకి తీసుకుని కరీంనగర్ కు తరలించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చోటు చేసుకుంది. ఈ సందర్భంగా తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు బండి సంజయ్(Bandi Sanjay). రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, ప్రజాస్వామ్యం లేకుండా పోయిందన్నారు. రాచరిక పాలన సాగుతోందని ధ్వజమెత్తారు.
అరెస్టులకు, దాడులకు తాము భయపడే ప్రసక్తి లేదన్నారు. భైంసా ఏమైనా పాకిస్తాన్ లో ఉందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆరు నూరైనా సరే షెడ్యూల్ ప్రకారం తాను పాదయాత్ర చేసి తీరుతానని స్పష్టం చేశారు. తనను అడ్డుకుంటే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని హెచ్చరించారు. భైంసాలో ప్రజలను కాపాడలేని దద్దమ్మ కేసీఆర్ అంటూ నిప్పులు చెరిగారు. ఎంఐఎం నేతల ఒత్తిళ్లతోనే తనను అక్కడికి వెళ్లకుండా అడ్డుకున్నారంటూ ధ్వజమెత్తారు బండి సంజయ్.
ఖాకీలు ఫక్తు గులాబీ బాస్ కు ఊడిగం చేస్తున్నారని, పార్టీ కార్యకర్తల కంటే అధ్వాన్నంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు. తన యాత్రకు ముందు అనుమతి ఇచ్చారని కానీ ఆ తర్వాత అరెస్ట్ చేశారంటూ ఫైర్ అయ్యారు. అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక పర్మిషన్ రద్దు చేస్తా ఎట్లా అని ప్రశ్నించారు. ఇది పూర్తిగా కక్ష సాధింపు చర్యగా అభివర్ణించారు. ఇదిలా ఉండగా నిర్మల్ ఎస్పీ ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా తాము అనుమతి ఇవ్వడం లేదని స్పష్టం చేశారు.
Also Read : కేసీఆర్ మోసం తెలంగాణకు ద్రోహం – షర్మిల