కర్ణాటకలో ఎన్నికల యుద్దం ముగిసింది. కానీ అసలైన వార్ మొదలైంది. నువ్వా నేనా అన్న రీతిలో ఇద్దరు తలపండిన నేతలు పోటీ పడుతున్నారు సీఎం పదవి కోసం. ఒకరు మాజీ సీఎం సిద్దరామయ్య ఇంకొకరు కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ డీకే శివకుమార్.
ఇద్దరూ ఉద్దండులే. రాజకీయంగా తలపండిన నాయకులే. ప్రస్తుతం ఊహించని రీతిలో కాంగ్రెస్ పార్టీకి కన్నడ వాసులు పట్టం కట్టారు. ఎవరి మీదా ఆధార పడకుండా భారీ మెజారిటీని కట్టబెట్టారు. అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి కోలుకోలేని షాక్ ఇచ్చారు.
224 అసెంబ్లీ సీట్లకు గాను కాంగ్రెస్ పార్టీ 137 సీట్లు సాధించింది. బీజేపీ 65 సీట్లకే పరిమితమైంది. ఇక జేడీఎస్ కు కూడా బిగ్ షాక్ తగిలింది. ఇక పార్టీకి పూర్వ వైభవం తీసుకు రావడంలో ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన డీకే శివకుమార్ కీలక పాత్ర పోషించారు. తను జైలు పాలైనా ఆ తర్వాత పడి లేచిన కెరటంలా సత్తా చాటాడు. ఒక రకంగా చెప్పాలంటే పార్టీలో వన్ మ్యాన్ షోగా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు.
మరో వైపు సిద్దరామయ్య కు ఉన్న పెద్ద బలం ఆయనకు హై కమాండ్ లో పట్టు ఉండడం. అంతే కాదు క్లీన్ ఇమేజ్ కలిగి ఉండడం. ఇప్పుడు ఇద్దరి మధ్య పోటీ నెలకొంది. ఇద్దరూ సీఎం పదవిపై ఆసక్తి ఉన్నట్టు ప్రకటించారు. దీంతో హై కమాండ్ ఎవరి వైపు మొగ్గు చూపుతుందో వేచి చూడాల్సింది. రేపటి దాకా ఆగాల్సిందే. బంతి హైకమాండ్ చేతిలో ఉంది.
