చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ పుట్టిన రోజు ఈనెలలోనే ఉంది. ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉండడంతో ఈ అగ్ర నటుడి బర్త్ డే కోసం భారీ ఎత్తున ప్లాన్ చేస్తోంది టీవీకే పార్టీ. ఇదిలా ఉండగా సీఎంగా కొలువు తీరిన తను సంచలన నిర్ణయాలకు తెర తీశారు. ఎన్నో ప్రజలకు ఉపయోగపడేలా తనదైన మార్క్ కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా సర్కార్ కీలక ప్రకటన చేసింది.
తమిళనాడు సీఎం విజయ్ పుట్టినరోజు సందర్భంగా జూ పార్కుల్లో జూన్ 21, 22 తేదీల్లో ఉచిత ప్రవేశం కల్పించనున్నట్లు తెలిపింది. ఈ రెండు రోజుల పాటు ప్రవేశ రుసుమును రద్దు చేయడం అనేది ప్రభుత్వ వేడుకల కార్యక్రమాల్లో ఒక భాగం చేసినట్లు ప్రకటించింది.
రాష్ట్రంలోని జూలాజికల్ పార్కులలో (మృగ ప్రదర్శనశాలల్లో) ప్రవేశ రుసుమును రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గురువారం వెల్లడించింది. ఈ నిర్ణయాన్ని వెల్లడిస్తూ, మంత్రి రంజిత్ కుమార్ విలేకరులతో మాట్లాడారు. ముఖ్యంగా చిన్నారి సందర్శకుల ఆనందం కోసమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. పిల్లలు తమకు దేవుళ్లతో సమానం. వారి సంతోషం కోసమే మేము దీనిని ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. సీఎం పుట్టినరోజు జూన్ 22న వస్తుంది, కాబట్టి ఈ రెండు రోజుల పాటు ప్రవేశ రుసుము మినహాయింపు అనేది ప్రభుత్వ వేడుకల చర్యలలో భాగంగా ఉందని పేర్కొంది.
ఇదిలా ఉండగా ఇటీవల తమిళనాడు రాష్ట్రంలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో 234 స్థానాలకు గాను టీవీకే అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. ఏకంగా డీఎంకేకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. విజయ్ పార్టీకి 108 సీట్లు రాగా మిగతా పార్టీలకు ఆశించిన మేర సీట్లు రాలేదు. మరో వైపు డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఇప్పుడు టీవీకే పార్టీ వైపు చూస్తున్నారు.
