కేంద్ర మంత్రి హర్దీప్ పూరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అకాళీదళ్ తో కలిసి పోటీ చేయదని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. మంగళవారం పూరీ మీడియాతో మాట్లాడారు. 25 ఏళ్ల కిందట బీజేపీ ఎస్ఏడీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ పంజాబ్ ప్రజల అంచనాలను అందు కోవడంలో విఫలమైందని ఆరోపించారు.
ఆ పార్టీతో కొనసాగడం వల్ల తమ పార్టీకి ఎలాంటి లాభం లేదన్నారు. చివరకు తమ పార్టీకి తీరని నష్టం జరిగిందని ఆవేదన చెందారు. రైల్ కోచ్ ఫ్యాక్టరీలో మాట్లాడిన ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.
వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలలో శిరోమణి అకాళీదళ్ తో మళ్లీ పొత్తు పెట్టుకునే ఛాన్స్ లేదన్నారు. ఇటీవల జలంధర్ ఉప ఎన్నికల ఫలితాల్లో ఆ పార్టీ పూర్తిగా ఆదరణ కోల్పోయిందన్నారు పూరీ.
పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశాన్ని తిరస్కరించిందని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాలు , పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి పూరీ స్పష్టం చేశారు. ఒకవేళ శిరోమణి అకాళీదళ్ నుంచి కొంత మది నాయకులు లేదా ఇటీవలి కాలంలో ఆ పార్టీని వీడిన వారు బీజేపీలో చేరి పోటీ చేయాలని అనుకుంటే తమకు అభ్యంతరం లేదన్నారు కేంద్ర మంత్రి. ఇదిలా ఉండగా అకాళీదళ్ రైతు చట్టాల పోరాటం సందర్బంగా బీజేపీతో తెగదెంపులు చేసుకుంది.
