CM Revanth Reddy in London: మూసీ నది పునరుజ్జీవానికి ‘థేమ్స్’ ప్రణాళిక ?
మూసీ నది పునరుజ్జీవానికి ‘థేమ్స్’ ప్రణాళిక ?
CM Revanth Reddy: పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన విజయవంతం అయ్యింది. రూ.40,232 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్రం కొత్త రికార్డు నెలకొల్పింది. గత ఏడాది జరిగిన దావోస్ పెట్టుబడుల సదస్సులో రాష్ట్రం సాధించిన పెట్టుబడుల మొత్తం కంటే… ఈ సారి రెండు రెట్లు పెట్టుబడులు సాధించింది. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి వివిధ వేదికలపై మాట్లాడారు. చిన్న, సన్నకారు రైతుల పక్షాన నిలబడాలని ప్రపంచ దిగ్గజ కంపెనీలకు పిలుపునిచ్చారు. ‘‘అభివృద్ధితో పాటు సంక్షేమం అందించాలంటే పెట్టుబడులు, వృద్ధి కలిసి రావాలి. పారిశ్రామికవేత్తలందరూ హైదరాబాద్కు రావాలి’’ అని ముఖ్యమంత్రి దావోస్ వేదికగా ఆహ్వానించారు.
CM Revanth Reddy Tours
ఈ సందర్భంగా లండన్ లో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)… అక్కడి ‘థేమ్స్’ నదిని సందర్శించారు. ఈ సందర్భంగా ‘థేమ్స్’ నదిని నిర్వహిస్తున్న తీరు… అక్కడి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును అభివృద్ధి చేసిన విధానాలపై… థేమ్స్ నది పాలకమండలి, పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ ఉన్నతాధికారులు, నిపుణులతో చర్చించారు. ఈ సందర్భంగా దశాబ్దాలుగా వివిధ దశల్లో థేమ్స్ నదీతీరం వెంట చేపట్టిన సమగ్రాభివృద్ధి కార్యక్రమాలను అక్కడి కార్పొరేట్ ఎఫైర్స్ డైరెక్టర్ సియాన్ ఫోస్టర్, పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ హెడ్ రాజ్ కెహల్ లివీ రేవంత్కు వివరించారు. దీనితో ‘థేమ్స్’ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును… తెలంగాణలో మూసీ నది పునరుజ్జీవానికి వర్తింపజేయడంపై రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ‘థేమ్స్’ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు తరహాలో మూసీ నది పునరుజ్జీవానికి థేమ్స్ నది పాలకమండలి, పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ ఉన్నతాధికారులు, నిపుణులతో చర్చించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుకు సంబంధించిన అవుట్ లైన్, వివిధ సంస్థల భాగస్వామ్యంపైనా చర్చించారు. తన విజన్ 2050కి అనుగుణంగా ఈ ప్రాజెక్టును చేపట్టడంపై లండన్ అధికారులతో చర్చలు జరిపారు. ‘‘నది ఒడ్డున అభివృద్ధి కార్యక్రమాలతో పాటు… నదీ సంరక్షణకు అత్యున్నత ప్రాధాన్యమిచ్చాం. నదీజలాలను ఎల్లప్పుడూ సుస్థిరంగా ఉంచాలి. స్థానికులకు ఎక్కువ ప్రయోజనం ఉండే రెవెన్యూ మోడల్ను ఎంచుకోవాలి. ఈ ప్రాజెక్టును మరింత అత్యుత్తమంగా తీర్చిదిద్దే కొత్త విధానాలు ఎప్పటికప్పుడు గమనించాలి. ప్రాజెక్టు నిర్వహణపై నిరంతరం దృష్టి పెట్టాలి’’ అని లండన్ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అంతేకాదు మూసీ నదిని పునరుజ్జీవింపజేసేందుకు చేస్తున్న అన్ని ప్రయత్నాలకు తమ మద్దతు ఉంటుందని పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… ‘‘నదులు, సరస్సులు, సముద్రతీరం వెంట ఉన్న నగరాలన్నీ చరిత్రాత్మక అభివృద్ధిని సాధించాయి. హైదరాబాద్ నగరానికి అలాంటి ప్రత్యేకత ఉంది. అటు మూసీ నది వెంబడి, ఇటు హుస్సేన్సాగర్ చుట్టూ, ఉస్మాన్ సాగర్ లాంటి నదీవ్యవస్థ కేంద్రంగా హైదరాబాద్ అభివృద్ధి చెందింది. పునరుజ్జీవ ప్రాజెక్టు ద్వారా మూసీకి పునర్వైభవం తీసుకువస్తే.. నదులు, సరస్సులతో నగరం మరింత శక్తిమంతంగా తయారవుతుంది’’ అని వివరించారు. ఈ సమావేశంలో సీఎం ముఖ్యకార్యదర్శి శేషాద్రి, పురపాలక, పట్టణాభివృద్ధి ముఖ్యకార్యదర్శి దానకిశోర్, సీఎం ప్రత్యేక కార్యదర్శి బి.అజిత్రెడ్డి, హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్, మూసీ నది అభివృద్ధి సంస్థ ఎండీ ఆమ్రపాలి, ఆ సంస్థ ఎస్ఈ వెంకటరమణ, పెట్టుబడుల ప్రచార ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్రెడ్డి పాల్గొన్నారు.
Also Read : Myanmar Army in Mizoram: భారత్ లో మయన్మార్ సైనికుల అక్రమ చొరబాటు ! కేంద్రాన్ని ఆశ్రయించిన మిజోరం