Minister Kishan Reddy : దేశ వ్యతిరేక శక్తులన్నీ బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాయి

ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా మూడోసారి అధికారంలోకి వచ్చి ప్రధాని మోడీ చరిత్ర సృష్టించారని కేంద్ర మంత్రి చెప్పారు...

Minister Kishan Reddy : 2024పార్లమెంట్ ఎన్నికల్లో దేశ వ్యతిరేక శక్తులన్ని బీజేపీకి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారాలు, కుట్రలు చేశాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని, రిజర్వేషన్లు తొలగిస్తారని కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ జిల్లా కార్యకర్తల విసృతస్థాయి సమావేశంలో కిషన్ రెడ్డి(Minister Kishan Reddy) పాల్గొన్నారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా మూడోసారి అధికారంలోకి వచ్చి ప్రధాని మోడీ చరిత్ర సృష్టించారని కేంద్ర మంత్రి చెప్పారు. చరిత్రలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్‌ని కాంగ్రెస్ పార్టీ అనేకసార్లు అవమానించిందని, ఆయణ్ని ఎన్నికల్లో ఓడించాలని కుట్రలు చేసినట్లు ఆయన చెప్పుకొచ్చారు. అధికారం, ఎన్నికలతో సంబంధం లేకుండా సంస్థాగతంగా ముందుకెళ్లే పార్టీ బీజేపీ మాత్రమే అని అన్నారు. దేశంలో సిద్ధాంతపరంగా, కార్యకర్తల ఆధారంగా, ప్రజాస్వామ్యయుతంగా నడుచుకునే పార్టీ బీజేపీనే అని కార్యకర్తలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

Minister Kishan Reddy Comment

పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి జవహర్ లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి నరేంద్ర మోడీ ఘనత సాధించారంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Minister Kishan Reddy) సంతోషం వ్యక్తం చేశారు. జమ్మూకశ్మీర్‌లో దేశ వ్యతిరేక శక్తులను పెంచి పోషించేందుకు వీలుగా ఉన్న ఆర్టికల్ 370ని రద్దు చేసి బడుగు, బలహీన వర్గాలు, మహిళలకు హక్కులు కల్పించిన ఘనత ప్రధాని మోడీకే దక్కుతుందన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100సీట్లు కూడా సాధించలేదు కానీ రాహుల్ గాంధీ మాత్రం తానే ప్రధానమంత్రి అయిపోయినట్లు ఊహల్లో తేలిపోయారని ఎద్దేవా చేశారు. దేశ చరిత్రలో ఎన్నికల్లో ఓడిపోయి సంబరాలు చేసుకున్న పార్టీని మెుదటిసారి చూశానని కాంగ్రెస్‌ను ఉద్దేశించి ఆయన అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్షన్ ప్రచారం చేసుకోవచ్చని కానీ దేశ వ్యతిరేక శక్తులు, తీవ్రవాద శక్తులు చాప కింద నీరులా వ్యాపించి బీజేపీకి వ్యతిరేకంగా అనేక కుతంత్రాలు చేశాయన్నారు. ఓడిపోయిన తర్వాత అసహనంతో పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగంపై ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అబద్ధాలు, తప్పుడు ఆరోపణలతో విషం చిమ్మారని ధ్వజమెత్తారు.

దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉగ్రవాదం, కుటుంబ పాలన, అవినీతి బాగా పెరిగిపోయినట్లు దేశ ప్రజలు గ్రహించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Minister Kishan Reddy) చెప్పారు. అందుకే మూడుసార్లు ఎన్డీయేకి పట్టం కట్టారన్నారు. దేశంలో ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో సహా అణచివేసిన ఘనత మోడీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్‌లో బాంబుపేలుళ్లతో ప్రజలు వణికిపోయారు. బొగ్గు కుంభకోణం, కామన్ వెల్త్ కుంభకోణం, 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం వంటి అనేక కుంభకోణాలతో సుమారు రూ.12లక్షల కోట్ల అవినీతికి పాల్పడిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని ఆయన ఆరోపించారు. మోడీ ప్రభుత్వంలో దేశంలో అభివృద్ధి పరంగా అనేక మార్పులు వచ్చాయని, రానున్న పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం మరోసారి బయటపడుతుందని కేంద్ర మంత్రి వెల్లడించారు. లోక్ సభ జరగకుండా అడ్డుపడటం, రాజ్యాంగం గురించి అబద్ధాలు ప్రచారం చేయడమే లక్ష్యంగా ఆ పార్టీ వ్యవహరించేందుకు సిద్ధమైందని ఆయన చెప్పారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

Also Read : MP Akhilesh Yadav : కేంద్రంలో సర్కార్ కుప్పకూలనుందంటూ విమర్శలు చేసిన సమాజ్ వాది పార్టీ చీఫ్

Leave A Reply

Your Email Id will not be published!