Gas Leak in Madhya Pradesh: మధ్యప్రదేశ్‌ లో క్లోరిన్‌ గ్యాస్ లీక్‌ ! 60 మందికి అస్వస్థత !

మధ్యప్రదేశ్‌ లో క్లోరిన్‌ గ్యాస్ లీక్‌ ! 60 మందికి అస్వస్థత !

మధ్యప్రదేశ్‌ లో పెను ప్రమాదం చోటుచేసుకుంది. షాడోల్-అనుప్పూర్ సరిహద్దులో ఉన్న సోడా ఫ్యాక్టరీలో క్లోరిన్‌ గ్యాస్ పైప్‌లైన్ లీకేజీ కారణంగా ఆ ప్రాంతంలో విషవాయువు వ్యాపించింది. దీనితో జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సమాచారం అందిన వెంటనే అనుపూర్ పరిపాలన అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని, బాధితులను ఆస్పత్రికి తరలించారు.

 

ఈ గ్యాస్ లీకేజీ కారణంగా పలువురు కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. 60 మందికి పైగా బాధితులను చికిత్స కోసం సమీప ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వీరిలో పెద్దలు, వృద్ధులు, పిల్లలు కూడా ఉన్నారు. బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నట్లు తెలుస్తోంది.

 

శనివారం రాత్రి 8.30 గంటల తర్వాత సోడా ఫ్యాక్టరీ సమీపంలో నివాసం ఉంటున్న కొందరికి ఒక్కసారిగా ఊపిరాడక, కళ్లు తిరగడం మొదలైంది. అకస్మాత్తుగా ఇలా ఎందుకు జరుగుతోంతో ముందుగా ఎవరూ గ్రహించలేకపోయారు. కొద్దిసేపటి తరువాత ఫ్యాక్టరీలోని క్లోరిన్ గ్యాస్ పైపు లీకేజీ అయిందన్న వార్త వ్యాపించింది. నిముషాల వ్యవధిలోనే స్థానికులు ఈ విష వాయువు బారిన పడ్డారు. బాధితులతో ఆస్పత్రి కిటకిటలాడుతోంది. వైద్య సిబ్బంది బాధితులకు చికిత్స అందిస్తున్నారు.

 

గతంలో మధ్యప్రదేశ్ లోని భోపాల్ గ్యాస్ దుర్ఘటన ప్రపంచంలో అతి పెద్ద దుర్ఘటనగా చరిత్ర కెక్కింది. ఈ ఘటనలో వేలాది మంది ప్రాణాలు కోల్పోగా… ఇప్పటికీ కూడా ఆ ప్రాంతంలో గడ్డి మొక్క కూడా మొలవని పరిస్థితి నెలకొంది. ఈ నేపధ్యంలో ఈ గ్యాస్ లీకేజీతో మరోసారి మధ్యప్రదేశ్ వార్తల్లోకి ఎక్కింది.

Leave A Reply

Your Email Id will not be published!