Former Employees Union: జగన్ సమక్షంలో వైసీపీలోకి చేరిన మాజీ ఉద్యోగ సంఘం నేతలు

జగన్ సమక్షంలో వైసీపీలోకి చేరిన మాజీ ఉద్యోగ సంఘం నేతలు

Former Employees Union : వైసీపీ అధినేత వైఎస్‌ జ‌గ‌న్‌మోహన్‌రెడ్డి(YS Jagan) స‌మ‌క్షంలో పలువురు మాజీ ఉద్యోగ సంఘాలకు చెందిన నేతలు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ వారికి కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్సార్‌సీపీ ఉద్యోగులు, పెన్ష‌న‌ర్స్ విభాగం రాష్ట్ర అధ్య‌క్షులు న‌ల‌మారు చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి నేతృత్వంలో ఉద్యోగుల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బీవీ సుబ్బారావు, ఏపీఎన్జీవో సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాస‌రావు, శ్రీకాకుళం జిల్లా మాజీ ఎన్జీవోస్ కార్యదర్శి బి.ఉమామహేశ్వ‌ర‌రావు, రెవెన్యూ అసోసియేష‌న్ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజ‌య‌సింహారెడ్డి, కృష్ణా జిల్లా ఎన్జీవోస్ సంఘం నాయ‌కులు తోట సీతారామంజ‌నేయులు త‌దిత‌రులు పార్టీలో చేరారు. అనంతరం వారు తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

Former Employees Union – ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌పై ఉద్యమిస్తాం న‌ల‌మారు – చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి

కూటమి ప్రభుత్వంలో ఉద్యోగులకు న్యాయం జరగడం లేదు. ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఇప్పటికే ఉద్యోగులు గత వైయస్ఆర్‌సీపీ(YSRCP) పాలనను తలుచుకుంటున్నారు. తాజాగా ఉద్యోగ నాయ‌కుల చేరిక‌తో వైయ‌స్సార్సీపీ ఉద్యోగులు, పెన్ష‌న‌ర్స్ విభాగం మరింత బ‌లోపేతం అయ్యింది. అంద‌రం క‌లిసిక‌ట్టుగా ఉద్యోగుల, పెన్ష‌న‌ర్ల‌ సంక్షేమం, స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ప‌నిచేస్తాం. వైయ‌స్సార్సీపీని బ‌లోపేతం చేయ‌డం ద్వారా వైయ‌స్ జ‌గ‌న్‌(YS Jagan)ను మ‌రోసారి ముఖ్య‌మంత్రిగా చేసుకునేందుకు కృషి చేస్తాం.

వైఎస్‌ జ‌గ‌న్‌ను సీఎం చేయడమే మా ల‌క్ష్యం – బీవీ సుబ్బారావు

వైఎస్‌ జ‌గ‌న్‌(YS Jagan)ను మ‌ళ్లీ ముఖ్య‌మంత్రిని చేయాల‌న్న ల‌క్ష్యంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేర‌డం జ‌రిగిందని ఉద్యోగుల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బీవీ సుబ్బారావు అన్నారు. ఉద్యోగుల స‌మ‌స్య‌లు, ప్ర‌భుత్వంపై ఉద్యోగ వర్గాల ఆలోచ‌న‌ల్లో వచ్చిన మార్పుల‌ను ఆయ‌న‌కు వివ‌రించ‌డం జ‌రిగిందన్నారు.

ఉద్యోగులకిచ్చిన హామీలు నెర‌వేర్చాలి – బండి శ్రీనివాస‌రావు

మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ గారి స‌మ‌క్షంలో పార్టీలో చేర‌డం జ‌రిగింది. మాట త‌ప్ప‌ను, మ‌డ‌మ తిప్ప‌ను అని మాటల్లో కాకుండా త‌న ఐదేళ్ల సంక్షేమ పాల‌న‌తో నిరూపించుకున్న గొప్ప నాయ‌కుడు జ‌గ‌న్‌. మేనిఫెస్టోను ఖురాన్ బైబిల్ భ‌గ‌వ‌ద్గీత‌గా భావించి ప‌రిపాల‌న చేశారు. ఆయ‌న్ను తిరిగి ముఖ్య‌మంత్రిని చేసుకోవాల‌న్న ల‌క్ష్యంతో ప‌నిచేస్తాం. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ఉద్యోగులు నానా అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. అధికారంలోకి వ‌చ్చి 11 నెల‌లు గ‌డిచినా ఉద్యోగుల‌కు ఎన్నిక‌ల్లో ఏ ఒక్క హామీని నేటికీ అమ‌లు చేయ‌లేదు. కాంట్రాక్టు ఉద్యోగులు, లెక్చ‌ర‌ర్ల‌ను క్ర‌మ‌బ‌ద్ధీక‌రించకుండా కాల‌యాప‌న చేస్తున్నారు. పెన్ష‌న‌ర్లకు ఎన్‌క్యాష్ మెంట్ ఆఫ్ ఎర్ర‌ర్ లీవ్ బెనిఫిట్స్‌, రెగ్యుల‌ర్ ఉద్యోగులు, పోలీసుల స‌రెండ‌ర్ లీవ్ బెనిఫిట్స్ అమ‌లు కాలేదు. డీఏలు పెండింగ్‌లో ఉంచారు. ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్సీపీలో చేర‌డం జ‌రిగింది.

జ‌గ‌న్ వ‌స్తేనే మ‌ళ్లీ ఉద్యోగులకు మంచిరోజులు – ఉమామ‌హేశ్వ‌ర‌రావు

2019 నుంచి 2024 వ‌ర‌కు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన వైఎస్‌ జ‌గ‌న్ త‌న సంక్షేమ పాల‌న‌తో గుప్తుల స్వ‌ర్ణ‌యుగాన్ని గుర్తుకు తెచ్చారు. కరోనా విల‌య‌తాండ‌వంతో ప్ర‌పంచ‌మంతా వ‌ణికిపోయినా సంక్షేమ ప‌థ‌కాల‌ను ఆప‌కుండా రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను త‌న కుటుంబంలా కాపాడుకున్నారు. కూట‌మి ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ల‌క్ష‌న్న‌ర కోట్ల‌కుపైగా అప్పులు చేసినా ఆ డ‌బ్బంతా ఏం చేసిందో అర్థంకాని ప‌రిస్థితి. మోస‌పూరిత హామీల‌తో అధికారం చేజిక్కించుకున్న కూట‌మి ప్ర‌భుత్వం కార‌ణంగా సామాన్య ప్ర‌జ‌లే కాకుండా ఉద్యోగులు, పెన్ష‌న‌ర్లు కూడా తీవ్రంగా ఇబ్బంది ప‌డుతున్నారు. మ‌ళ్లీ వైయ‌స్ జ‌గ‌న్ ను సీఎం చేసుకుంటేనే ఈ రాష్ట్రానికి మంచి రోజులొస్తాయి. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమం కోసం వైయ‌స్సార్సీపీలో చేర‌డం జ‌రిగిందని రెవెన్యూ అసోసియేష‌న్ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజ‌య‌సింహారెడ్డి తెలిపారు. వైఎస్‌ జగన్‌ సీఎం అయితేనే ఉద్యోగుల‌కు మ‌ళ్లీ మంచిరోజులొస్తాయన్నారు.

Also Read : Operation Sindoor: ‘ఆపరేషన్‌ సిందూర్‌’కు అభినందనల వెల్లువ

Leave A Reply

Your Email Id will not be published!