Nampally: చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధం

చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధం

Nampally : ఆస్తమా రోగులకు బత్తిన సోదరులు ప్రతీ ఏటా ఉచితంగా సరఫరా చేసే చేప ప్రసాదం పంపిణీకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నాంపల్లి(Nampally) ఎగ్జిబిషన్‌ మైదానంలో రేపటి నుండి అంటే ఆదివారం నుండి రెండు రోజుల పాటు జరిగే చేప ప్రసాదం పంపిణీకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మెట్టు సాయికుమార్‌ తెలిపారు. చేప ప్రసాదం నిర్వాహకుడు బత్తిని గౌరీశంకర్‌ గౌడ్‌తో కలిసి ఆయన ఏర్పాట్లను పరిశీలించారు. రోగులు, వారి సహాయకుల కోసం భోజనం, వసతి, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్న స్వచ్ఛంద సంస్థలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరారు.

మృగశిర కార్తె సందర్భంగా బత్తిన సోదరులు పంపిణీ చేసే చేప ప్రసాదం పంపిణికి నాంపల్లి(Nampally) ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం ఉదయం 11 గంటల నుంచి ప్రారంభమయ్యే చేప మందు పంపిణీ సోమవారం కూడా కొనసాగనుంది. దీనితో ఈ చేప ప్రసాదం పంపిణీకి కేవలం తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్,మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తర ప్రదేశ్, ఒడిసా, చత్తీస్ ఘఢ్ తదితర రాష్ట్రాల నుంచి అస్తమా బాధితులు వస్తుంటారు. ఫిష్ మెడిసిన్(Fish Medicine) తీసుకునేందుకు గాను ఇప్పటికే ఎగ్జిబిషన్ మైదానానికి ఉబ్బస వ్యాధి గ్రస్తులు రావడం మొదలు కాగా వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆర్ అండ్ బీ అధికారులు షెడ్లు, ఫ్లడ్ లైట్లు, క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంచారు. జీహెచ్ఎంసీ అధికారులు శానిటేషన్, జలమండలి మంచినీటి సరఫరా ఏర్పాట్లకు సన్నాహాలు చేస్తున్నారు. చేప ప్రసాదం పంపిణీని దివంగత బత్తిన హరినాథ్ గౌడ్ కుమారుడు అమర్ నాథ్ గౌడ్, సోదరుడు గౌరీశంకర్ లు పంపిణీ చేయనున్నారు.

Nampally – 42 క్యూలైన్ల ద్వారా పంపిణీ

చేప ప్రసాదం(Fish Medicine) పంపిణీ చేసే ఆది , సోమ వారాలలో సుమారు సుమారు లక్షకు పైగా అస్తమా బాధితులు వస్తారని అధికారులు అంచనా వేసి వారికి సరిపోయేలా చేప ప్రసాదం సిద్ధం చేశారు. మత్స్యశాఖ ఇప్పటికే 1.5 లక్షల కొర్రమీను చేపపిల్లలను రెడీగా ఉంచారు. చేప ప్రసాదాన్ని శాకాహారులకు బెల్లంతో అందజేస్తారు. చిన్నపిల్లల నుంచి వందేళ్ల వృద్ధుల వరకు ఎవరైనా ఈ చేప ప్రసాదం వేసుకోవచ్చని, అయితే గర్భిణులు మాత్రం తీసుకోవద్దని నిర్వాహకులు తెలిపారు. చేప ప్రసాదాన్ని పరగడుపున లేదా భోజనం తీసుకున్న మూడు గంటల తర్వాత తీసుకోవాలని సూచించారు. ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో 42 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. దివ్యాంగులు, వృద్ధులు, మహిళల కోసం ప్రత్యేక క్యూలైన్లు, కౌంటర్లు అందుబాటులో ఉన్నాయి.వీఐపీ కౌంటర్లు కూడా ఏర్పాటు చేశారు .

టోకెన్లపై టైం కేటాయింపు

ఈ ఏడాది చేప ప్రసాదం పంపిణీ(Fish Medicine) కౌంటర్ల వద్ద రద్దీని తగ్గించేందుకు గాను అధికారులు వినూత్న చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా రోగులకు ఇచ్చే టోకెన్లపై సమయం ముద్రించారు. ప్రతి రెండు గంటలకు ఒక సారి టోకెన్లపై టైమింగ్స్ మారుతుంటాయి. టోకెన్లు అందుకున్న వారు వారికి కేటాయించిన సమయంలోనే క్యూ లైన్లలోకి రావాల్సి ఉంటుంది. అందుకు భిన్నంగా క్యూ లైన్ల లోకి వచ్చే వారిని అనుమతించబోరు. ఉబ్బస రోగులకు టోకెన్ల పంపిణీ కార్యక్రమం కూడా ఇప్పటికే ప్రారంభమైంది. ప్రసాదం పంపిణీ మొదలయ్యే సమయం వరకు టోకెన్ల పంపిణీ ఉంటుంది .

చేప ప్రసాద పంపీణీని ప్రారంభించనున్న స్పీకర్, మంత్రులు

చేప ప్రసాద పంపీణీని ఆదివారం ఉదయం 9 గంటలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ , రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్ , శ్రీధర్ బాబు , టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ , ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించనున్నారు. వీరితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు , కార్పొరేషన్ల చైర్మెన్లు , పలు ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

ఉచిత భోజనం అందిస్తున్న స్వచ్ఛంద సంస్థలు

చేప ప్రసాదం కోసం వచ్చే అస్తమా బాధితులు, వారి సహాయకులకు పలు స్వచ్ఛంద సంస్థలు ఆహారం, నీటిని అందించేందుకు ఏర్పాట్లు చేశాయి . ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం ఉచితంగా సరఫరా చేస్తున్నాయి. పోలీసు శాఖ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. వేల సంఖ్యలో చేప ప్రసాదం కోసం బాధితులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు. మరోవైపు అగ్నిమాపక సిబ్బంది కూడా ఎలాంటి ఘటనలు జరిగినా ఎదుర్కొవడానికి చర్యలు చేపట్టింది.

ప్రత్యేక బస్సులు నడుపనున్న ఆర్టీసీ

చేప ప్రసాదం(Fish Medicine) కోసం దేశవ్యాప్తంగా ఉన్న బాధితులు రైళ్లు, బస్సుల్లో నగరానికి వస్తుండడంతో వారు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. ఆదివారం ఉదయం నుండి ఫిష్ మెడిసిన్ పంపిణీ ముగిసేంత వరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపనుంది . సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌, కాచిగూడ రైల్వే స్టేషన్‌, జేబీఎస్‌, ఎంజీబీఎస్‌, ఈసీఐఎల్‌ ఎక్స్‌ రోడ్‌, శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వంటి ప్రాంతాల నుండి కూడా ప్రత్యేక బస్సులు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు ఏర్పాటు చేశారు. వైద్య ఆరోగ్య శాఖ కూడా పలు వైద్య బృందాలను ,అంబులెన్స్ లను అందుబాటులో ఉంచింది. మొత్తం మీద చేప ప్రసాదం పంపిణీకి వచ్చే ఉబ్బస రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఫిషరీస్, జీహెచ్ఎంసీ, వైద్య ఆరోగ్యశాఖ, ఆర్టీసీ , ఫైర్ , పోలీస్ తదితర విభాగాల అధికారులు పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నారు. శుక్రవారం బత్లిన కుటుంబ సభ్యులతో కలిసి తెలంగాణ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ఎగ్జిబిషన్ మైదానం వద్ద జరుగుతున్న ఏర్పాట్లను సమీక్షించారు.

Also Read : Congress Leaders: మహిళా ఎస్‌ఐతో కాంగ్రెస్ నాయకులు అనుచిత ప్రవర్తన

Leave A Reply

Your Email Id will not be published!