ECI: రాహుల్ గాంధీ రిగ్గింగ్ వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ ఆగ్రహం
రాహుల్ గాంధీ రిగ్గింగ్ వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ ఆగ్రహం
2024 అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఆరోపించిన విషయం తెలిసిందే. ఎన్నికల కమిషన్ నియామకం కోసం ప్యానల్ రిగ్గింగ్ తో ప్రారంభించి అవకతవకల సాక్ష్యాలను దాచిపెట్టడంతో ఐదంచెల్లో మ్యాచ్ ఫిక్సింగ్ వ్యూహాన్ని బీజేపీ మహరాష్ట్రలో అనుసరించిందని అన్నారు. త్వరలో జరుగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్ పునరావృతం కానుందని రాహుల్ వ్యాఖ్యానించారు. వంచనకు పాల్పడిన వారు గెలవచ్చేమో కానీ… ఇలాంటి పద్ధతుల వల్ల ప్రజాస్వామ్యం బలహీనపడి, వ్యవస్థలపై ప్రజలకు విశ్వాసం పోతుందని చెప్పారు.
దీనితో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాహుల్ వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమని, చట్ట పాలనను అవమానించడమేనని పేర్కొంది. రాహుల్ వ్యాఖ్యలు అసంబద్ధమని, తప్పుదారి పట్టించేలా ఉన్నాయని ఒక ప్రకటనలో ఆక్షేపణ తెలిపింది. ఎన్నికల కమిషన్ డిసెంబర్ 2024న ఇందుకు సంబంధించిన వాస్తవాలను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు తెలియజేసిందని, దానిని ఈసీఐ వెబ్సైట్ లో కూడా అందుబాటులో ఉంచిందని తెలిపింది. సాక్ష్యాలు లేకుండా పదేపదే ఎవరు ఆరోపణలు చేసినా వారికి చట్టం పట్ల వారికి గౌరవం లేదనే అభిప్రాయానికి తావిస్తుందని, నిష్పాక్షిక ఎన్నికల కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్న ఎన్నికల సిబ్బంది నైతికస్థైరాన్ని దెబ్బతీస్తుందని ఘాటుగా విమర్శించింది.
రాహుల్ కు బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన మ్యాచ్ ఫిక్సింగ్ బీహార్కు రాబోతోందంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను బీజేపీ తిప్పికొట్టింది. రాహుల్ వ్యాఖ్యలు హుందాగా లేవని, దేశ ప్రజాస్వామిక సంస్థలను బలహీనపరుస్తూ మాట్లాడటం ఆయనకు అలవాటుగా మారిందని ఆ పార్టీ ప్రతినిధి తుహిన్ సిన్హా అన్నారు. రాహుల్ లేవనెత్తిన అంశాలకు ఎన్నికల కమిషన్ అనేక మార్లు వివరణ ఇచ్చిందని గుర్తు చేశారు. ఈసీ చాలాసార్లు వివరంగా చెప్పినా.. రాహుల్ గాంధీ మళ్లీ దేశంలోని వ్యవస్థలను బూచిగా చూపే పనిలో ఉన్నారని మండిపడ్డారు. మహారాష్ట్ర శాసనసభకు 288 సీట్లు ఉన్నాయి. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో బీజేపీ, శివసేన(శిందే), ఎన్సీపీ(అజిత్ పవార్) కూటమి 235 సీట్లు గెల్చుకుంది. ఒక్క కమలం పార్టీకే 132 స్థానాలు దక్కాయి. మరోవైపు ఈ ఏడాది చివర్లో బిహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.