CBSE : ఇకనుండి ఏడాదికి రెండుసార్లు ‘పది’ పరీక్షలు

ఇకనుండి ఏడాదికి రెండుసార్లు ‘పది’ పరీక్షలు

CBSE : విద్యా వ్యవస్థలో కీలక మార్పులు చేసేందుకు కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్‌ ఎడ్యుకేషనల్‌ పాలసీ (ఎన్‌ఈపీ) భాగంగా సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ ఏడాది నుంచి రెండుసార్లు పది పరీక్షలు నిర్వహించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీనిలో భాగంగాపదో తరగతి పరీక్షలు ఏడాదికి రెండుసార్లు చేపట్టనున్నట్లు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ వెల్లడించింది. ఫిబ్రవరిలో నిర్వహించే తొలి విడత పరీక్షలను తప్పనిసరి చేయగా… మే నెలలో నిర్వహించే రెండో విడత పరీక్షలను ఆప్షనల్‌గా పెట్టింది. 2026 నుంచి ఇది అమల్లోకి రానుందని తెలిపింది. వీటికి సంబంధించి కొత్త నిబంధనలకు సీబీఎస్‌ఈ తాజాగా ఆమోదం తెలిపింది.

CBSE Updates

విద్యార్థులపై బోర్డు పరీక్షల ఒత్తిడి తగ్గించేందుకు వీలుగా నూతన జాతీయ విద్యా విధానం (NEP) పలు సిఫార్సు చేసింది. ఇందులో భాగంగానే ఫిబ్రవరి, మే నెలల్లో రెండు విడతల్లో పది పరీక్షలు నిర్వహించనున్నామని సీబీఎస్‌ఈ పరీక్షల విభాగాధిపతి సన్యం భరధ్వాజ్‌ పేర్కొన్నారు. తొలి విడత పరీక్షా ఫలితాలు ఏప్రిల్‌లో, రెండో విడత జూన్‌ లో వెల్లడిస్తామన్నారు. సీబీఎస్‌ఈ (CBSE) తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం, విద్యార్థులు సైన్స్‌, మ్యాథ్స్‌, సోషల్‌ సైన్స్‌, లాంగ్వేజ్‌ సబ్జెక్ట్స్‌లలో ఏదైనా మూడు విభాగాలలో తక్కువ మార్కులు వచ్చినా, వారు మళ్లీ పరీక్ష రాసుకునే అవకాశం కల్పించారు. తద్వారా విద్యార్థులకు ఒత్తిడి తగ్గించి, వారి అసలు సామర్థ్యాన్ని మెరుగ్గా చూపించేందుకు సహాయ పడనుట్లు తెలిపారు. వీటివల్ల విద్యార్థులు మార్కులు మెరుగుపరచుకునే వీలు ఉంటుందన్నారు. అయితే, అంతర్గత మదింపు మాత్రం ఏడాదికి ఒకసారి ఉంటుందని చెప్పారు.

ఇదిలాఉంటే, పదోతరగతి పరీక్షలు రెండు దశల్లో నిర్వహణకు సంబంధించి నిబంధనల ముసాయిదాను సీబీఎస్‌ఈ గతంలోనే వెలువరించింది. ఈ రెండు పరీక్షలూ పూర్తిస్థాయి సిలబస్‌తోనే నిర్వహిస్తామని అందులో స్పష్టం చేసింది. ఈ విధానంపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి స్పందనలు స్వీకరించిన బోర్డు వాటి అమలుకు సిద్ధమైంది.

Also Read : India: భారత అంతరిక్ష రంగంలో సరికొత్త విప్లవం

Leave A Reply

Your Email Id will not be published!