TTD: పాముకాటుకు గురైన టీటీడీ ఉద్యోగి భాస్కరనాయుడు
పాముకాటుకు గురైన టీటీడీ ఉద్యోగి భాస్కరనాయుడు
TTD : టీటీడీ అటవీశాఖ ఒప్పంద ఉద్యోగి భాస్కరనాయుడు(68) మరోమారు పాము కాటుకు గురయ్యారు. తిరుమల కల్యాణవేదిక వద్ద ఓ పెద్ద నాగుపాము ఉన్నట్లు శుక్రవారం మధ్యాహ్నం స్థానికులు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న భాస్కరనాయుడు పామును పట్టుకుంటుండగా కాటేసింది. తోటి ఉద్యోగులు వెంటనే టీటీడీ (TTD) అశ్విని ఆసుపత్రిలోని అపోలో అత్యవసర క్లినిక్లో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కరకంబాడీలోని అమరా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి ప్రస్తుతానికి నిలకడగా ఉన్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. గతంలో ఎస్వీ యూనివర్సిటీలో అర్ధరాత్రి పామును పట్టేందుకు వెళ్లిన భాస్కరనాయుడిని పాము కాటేయడంతో ప్రాణాపాయ స్థితికి చేరుకున్నారు. టీటీడీ (TTD) స్వయంగా ఖర్చులు చెల్లించి చికిత్స చేయించింది. భాస్కరనాయుడు తన సర్వీస్ లో తిరుమలలో14 వేల పాములకు పైగా పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో అతను పదవీ విరమణ కాలం పూర్తి కావడంతో… కాంట్రాక్టు పద్దతిలో అతని సేవలు టీటీడీ వినియోగించుకుంటోంది.
TTD – తిరుమలకు వచ్చే భక్తులందరికీ బీమా ?
తిరుమలకు వచ్చే భక్తులందరికీ భవిష్యత్తులో బీమా సదుపాయం కల్పించాలని టీటీడీ ఉన్నతాధికారి పరిశీలిస్తున్నట్లు సమాచారం. శ్రీవారి దర్శనార్థం రోజూ సుమారు 70వేల నుంచి లక్ష మంది వరకు భక్తులు వస్తుంటారు. 2 ఘాట్రోడ్లు, అలిపిరి, శ్రీవారి మెట్టుమార్గం, క్యూలైన్లు తదితర ప్రదేశాల్లో అప్పుడప్పుడు ప్రమాదాలకు గురికావడం, ఆకస్మికంగా అనారోగ్యం బారిన పడడం, నడక మార్గంలో అడవి జంతువుల దాడి లాంటి ఘటనల నేపథ్యంలో భక్తులకు బీమా కల్పించాలని యోచిస్తున్నారు. ప్రమాదాలు, ఆకస్మిక గుండెపోటు, జంతువుల దాడిలో మృతిచెందిన వారికి బీమాతో చేయూతనందించాలని చూస్తున్నారు. ప్రస్తుతానికి తిరుమలలో ప్రమాదం బారిన పడి మృతిచెందిన వారికి టీటీడీ రూ.3లక్షల వరకు చెల్లిస్తోంది. ఇప్పుడు అలిపిరి నుంచి తిరుమలకు, తిరుమల నుంచి అలిపిరి వరకు భక్తులు చేరుకునేవరకు వారికి బీమాను కల్పించాలని చూస్తున్నారు. భారీగా వచ్చే భక్తులకు బీమా కల్పించే సంస్థలు, అవి వసూలు చేసే ప్రీమియం, దాతల సహకారం తదితర అంశాలపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
Also Read : Swetcha Votarkar: పూర్ణ చంద్ర నాయక్ పై యాంకర్ స్వేచ్ఛ కుమార్తె సంచలన ఆరోపణలు
