Enforcement Directorate: బెట్టింగ్ యాప్ కేసులో గూగుల్, మెటాకు ఈడీ సమన్లు
బెట్టింగ్ యాప్ కేసులో గూగుల్, మెటాకు ఈడీ సమన్లు
Enforcement Directorate : ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) దర్యాప్తు ముమ్మరం చేస్తోంది. ఇటీవల 29 మంది సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై ఫోకస్ చేసిన ఈడీ అధికారులు… తాజాగా టెక్ దిగ్గజ కంపెనీలు గూగుల్, మెటాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఈ బెట్టింగ్ యాప్ లతో మనీలాండరింగ్, హవాలా లావాదేవీలు జరుగుతున్నట్లు ఆరోపణలు రావడంతో ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. అయినప్పటికీ… గూగుల్, మెటా సంస్థలు ఇలాంటి యాప్లను తమ మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయని దర్యాప్తు సంస్థ ఆరోపించింది. ఈ టెక్ కంపెనీలు బెట్టింగ్ యాప్ల ప్రకటనలకు స్లాట్లు కేటాయించడమే గాక, వెబ్సైట్ల లింక్లను కూడా అందుబాటులో ఉంచుతున్నాయని ఈడీ పేర్కొంది.
Enforcement Directorate Notices tto Google, Meta
ఆన్లైన్ బెట్టింగ్ యాప్లకు సంబంధించిన కేసుల దర్యాప్తును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా టెక్ దిగ్గజాలైన గూగుల్, మెటాకు దర్యాప్తు సంస్థ శనివారం నోటీసులు జారీ చేసింది. జులై 21న ఈ కంపెనీ ప్రతినిధులు విచారణకు హాజరవ్వాలని ఆదేశించింది. అయితే ఈ పరిణామంపై ఆయా సంస్థల నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
దేశంలో మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ సహా పలు కుంభకోణాలు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. ఈ కేసులపై ఈడీ ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలను విచారించింది. ఈ కేసులో ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ భఘేల్ సహా పలువురు ప్రముఖులపై అభియోగాలు ఉన్నాయి. ఇక, బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల వ్యవహారంలో టాలీవుడ్కు చెందిన 29 మంది సినీనటులు, యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లపై ఈడీ ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్) నమోదు చేసింది. ఈ యాప్ ప్రమోషన్లతో పలువురు బెట్టింగ్లో డబ్బులు పెట్టి మోసపోయి ఆత్మహత్యలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Also Read : Israel: మారువేషంలో భారత్ లో ఇజ్రాయెల్ మంత్రి కోవర్ట్ ఆపరేషన్
