Ajit Doval: ట్రంప్ సుంకాల హెచ్చరికల వేళ రష్యా పర్యటనకు అజిత్ డోభాల్
ట్రంప్ సుంకాల హెచ్చరికల వేళ రష్యా పర్యటనకు అజిత్ డోభాల్
Ajit Doval: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారనే కారణంతో భారత్ పై భారీ సుంకాల బాంబును పేల్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.ఈ క్రమంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ (Ajit Doval) రష్యా పర్యటనకు వెళ్ళడం చర్చనీయాంశంగా మారింది. అయితే అజిత్ డోభాల్ పర్యటన ముందుగానే ఖరారైందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ నెలాఖరులో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా మాస్కోకు వెళ్లే అవకాశం ఉందని సమాచారం.
Ajit Doval Tour
భారత్- రష్యా సంబంధాలపై ట్రంప్ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ పర్యటన చర్చనీయాంశంగా మారింది. మాస్కోతో రక్షణ, ఇంధన సంబంధాల బలోపేతమే ఈ పర్యటన ముఖ్య లక్ష్యంగా తెలిపాయి. రష్యా చమురు సరఫరాలు, పరిశ్రమల సహకారం వంటి వాటితో పాటు మరిన్ని ఎస్-400 క్షిపణి వ్యవస్థలు, రష్యాకు చెందిన ఎస్యూ-57 యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన కీలక అంశాలపై మాస్కో అధికారులతో డోభాల్ చర్చలు జరిపే అవకాశం ఉందని వెల్లడించాయి.రష్యన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం… భారత రాయబారి అంతర్జాతీయ రక్షణ సహకారానికి బాధ్యత వహిస్తున్న కల్నల్-జనరల్ ఫోమిన్తో భేటీ అయ్యారు. ఇరువురి భేటీలో రక్షణ రంగంలో ద్వైపాక్షిక పరస్పర సహకారం వంటి అంశాలపై చర్చించాయి. భారత్-రష్యాల వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం చేసేలా పలు నిర్ణయాలు తీసుకున్నట్లు పేర్కొంది.
మరోవైపు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా ఈ నెలాఖరులో రష్యాలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఇరుదేశాల మధ్య రక్షణ, ఇంధన, వాణిజ్య చర్చలే లక్ష్యంగా ఆయన పర్యటన ఉండనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై చర్చించేందుకు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో సమావేశం కానున్నారు.
Also Read : Indian Airports: ఎయిర్ పోర్టులకు ఉగ్ర ముప్పు – హెచ్చరికలు జారీ చేసిన ఇంటెలిజెన్స్
