Vice President: తదుపరి ఉప రాష్ట్రపతి నామినీపై కొనసాగుతున్న ఉత్కంఠ
తదుపరి ఉప రాష్ట్రపతి నామినీపై కొనసాగుతున్న ఉత్కంఠ
Vice President : ఉప రాష్ట్రపతి ఎన్నికకు నెలరోజుల కంటే తక్కువ వ్యవధే ఉండటంతో పార్టీ అభ్యర్థిని ఖరారు చేసేందుకు భారతీయ జనతా పార్టీ ముమ్ముర కసరత్తు చేస్తోంది. ఉప రాష్ట్రపతిగా (Vice President) ఎంపిక చేసేందుకు అవకాశమున్న అభ్యర్థులతో చర్చలు సాగిస్తోంది. వీరిలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, బిహార్ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ సక్సేనా వంటి నేతలు సైతం ఉన్నారు. కాగా, సెప్టెంబర్ 9న ఉప రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది.
Vice President Nomination Excitement
గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవ్వ్రత్, కర్ణాటక గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్, సిక్కిం గవర్నర్ ఓం మాథూర్, జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తదితరులు కూడా రేసులో ఉన్నట్టు పార్టీ విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త శేషాద్రి చారి పేరు కూడా పరిశీలనలో ఉంది. వీటికితోడు బిహార్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ను తమ నామినీగా బీజేపీ ఎంపిక చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గత నెలరోజులుగా ఉప రాష్ట్రపతి (Vice President) అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేస్తున్నట్టు ఆ వర్గాలు చెబుతున్నాయి. జులై 21 ఆరోగ్య కారణాలతో జగ్దీప్ ధన్ఖడ్ ఉపరాష్ట్రపతి పదవికి అనూహ్యంగా రాజీనామా చేశారు. పార్టీకి, ధన్ఖఢ్కు మధ్య ఏడాదిగా పొరపొచ్చాలున్నాయనే అభిప్రాయాలకు ఈ పరిణామం తావివ్వడంతో ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా ఈసారి ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై బీజేపీ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఉపరాష్ట్రపతికి అంతగా అధికారాలు ఉండకపోయినా రాజ్యసభ ప్రొసీడింగ్స్కు సంబంధించి కీలక నిర్ణయాల విషయంలో ఇన్ ఛార్జిగా ఆయన వ్యవహరిస్తారు. కాగా, అభ్యర్థి ఎంపిక నిర్ణయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు నడ్డాకు అప్పగిస్తూ బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ఇటీవల నిర్ణయం తీసుకుంది.
బీజేపీ వర్గాల కథనం ప్రకారం పార్టీ అగ్రనేతలు, సన్నిహిత భాగస్వామ్య నేతలపై వచ్చే వారంలో ‘మెగా మీటింగ్’కు బీజేపీ ప్లాన్ చేస్తోంది. తద్వారా బలప్రదర్శనకు సిద్ధమవుతోంది. వర్షాకాల సమావేశాల సెకెండ్ ఫేజ్ మంగళవారం నాడు ప్రారంభం కానుండటంతో పార్టీ పార్లమెంటరీ సమావేశానికి ఎన్డీయే ఎంపీలందరినీ ఆహ్వానించింది. పార్లమెంటు ఆడిటోరియంలో జరిగే ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నారు.
Also Read : Rahul Gandhi: ఓట్ల చోరీపై ‘లాపతా ఓటు’ వీడియో విడుదల చేసిన రాహుల్ గాంధీ
