CM Chandrababu: ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ
ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ
CM Chandrababu : ప్రధానమంత్రి నరేంద్రమోదీతో దేశ రాజధాని ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ భేటీ దాదాపు 40 నిమిషాల పాటు జరిగింది. ఈ నెల 16న కర్నూలులో తలపెట్టిన సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ కార్యక్రమానికి ప్రధాని మోదీని ఆహ్వానించారు. అలాగే, నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరుగనున్న సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్కు మోదీని ఆహ్వానించారు. మరోవైపు ఢిల్లీలో రేపు (మంగళవారం) గూగుల్ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకునే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) పాల్గొననున్నారు.
కాగా, చారిత్రాత్మక గూగుల్ ఏఐ హబ్కు రేపు(మంగళవారం) ఢిల్లీలో అవగాహన ఒప్పందం జరుగనుంది. చంద్రబాబు (CM Chandrababu) బ్రాండింగ్, లోకేష్ కృషితో అతిపెద్ద పెట్టుబడి ఏపీకి రానుంది. గూగుల్ రాకతో ఏఐ సిటీగా రూపాంతరం చెందనుంది విశాఖపట్నం. మంత్రి లోకేష్ అమెరికా పర్యటనలోనే సంస్థ ప్రతినిధులతో తొలి చర్చలు జరిగిన విషయం తెలిసిందే. ఈ డీల్ తో ఏపీకి భారీ ఆదాయంతోపాటు యువతకు 1.88 లక్షల ఉద్యోగ అవకాశాలని కూటమి ప్రభుత్వం కల్పించనుంది.
CM Chandrababu – అమరావతిలో సీఆర్డీఏ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
రాజధాని అమరావతిలో సీఆర్డీఏ ప్రధాన కార్యాలయ భవనాన్ని సీఎం చంద్రబాబు (CM Chandrababu) ప్రారంభించారు. పూర్ణకుంభం, వేదాశీర్వచనాలతో ఆయనకు వేదపండితులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భూములిచ్చిన రైతులను సీఎం ఆత్మీయంగా పలకరించారు. 4.32 ఎకరాల్లో 3,07,326 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏడు ఫ్లోర్లలో (జీ+7) సీఆర్డీఏ భవనాన్ని నిర్మించారు. సీఆర్డీఏ సహా.. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖకు అనుబంధంగా ఉన్న రాష్ట్ర కార్యాలయాలన్నీ ఇందులోకి రానున్నాయి. రాజధాని అమరావతిని ప్రతిబింబించేలా భవనం ముందు ‘ఎ’ అక్షరం ఎలివేషన్తో తీర్చిదిద్దారు.
ప్రధాన కార్యాలయానికి పక్కనే మొత్తం 8 ఎకరాల్లో మరో 4 భవనాలు ఏర్పాటు చేశారు. ఒక్కో భవనం 41,500 చదరపు అడగుల విస్తీర్ణంలో ఉంది. పాలనా సౌలభ్యం కోసం హెచ్వోడీలన్నీ ఒకేచోట ఉండేలా భవనాల నిర్మాణం చేపట్టారు. సీఆర్డీఏ భవనం మొదటి అంతస్తులో సమావేశ మందిరాలు ఏర్పాటు చేశారు. 2, 3, 5 అంతస్తుల్లో సీఆర్డీఏ, నాలుగో అంతస్తులో సీడీఎంఏ పురపాలక డైరెక్టరేట్ ఉంది. ఆరో అంతస్తులో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, గ్రౌండ్ ఫ్లోర్లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేశారు.
CM Chandrababu – ఆదాయ వనరుల సమీకరణపై ఏపీ ప్రభుత్వం కసరత్తు
ఆదాయ వనరుల సమీకరణపై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఆదాయ వనరుల సమీకరణ కోసం ప్రత్యామ్నాయ మార్గాలని గుర్తించేందుకు మంత్రి వర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఆరుగురు మంత్రులతో మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కేబినెట్ సబ్ కమిటీలో సభ్యుడిగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఉన్నారు. జీవోఎం సభ్యులుగా మంత్రులు కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్, కందుల దుర్గేశ్, వంగలపూడి అనితని (Vangalapudi Anitha) కూటమి ప్రభుత్వం నియమించింది. ఈ క్రమంలో ఆదాయ వృద్ధికి ప్రత్యామ్నాయ చర్యల గుర్తింపు, అమలుపై చర్చించాలని ఆదేశాలు జారీ చేసింది. నెలవారీ ఆదాయాలను, లక్ష్యాలతో పోల్చి సమీక్షించాలని ఆజ్ఞాపించింది.
ఆదాయ పనితీరును మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన సంస్కరణలపై సిఫార్సు చేయాలని దిశానిర్దేశం చేసింది. ఏపీ ఆదాయం పెంచేందుకు తీసుకోవాల్సిన మార్పులు, సాంకేతికత అమలుపై సిఫార్సులు చేయాలని మార్గనిర్దేశం చేసింది. ఆదాయ వనరుల పెంపు కోసం పరిపాలనా పరంగా బలోపేతం చేయడంపై చర్చించాలని సూచించింది. ఆదాయ వనరుల పెంపుకోసం చట్టాలు, నియమాలు, విధానాలకు సవరణల అవసరాన్ని సమీక్షించాలని ఆదేశాలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.
పలు ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం, బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాలని ఆదేశించింది. పలు ప్రభుత్వ విభాగాల్లో విధానపరమైన అడ్డంకులని పరిష్కరించాలని సూచించింది. స్వర్ణాంధ్ర- 2047 దార్శనికతకు అనుగుణంగా మధ్యస్థ, దీర్ఘకాలిక ఆదాయ వ్యూహాలపై దిశానిర్దేశం చేయాలని ఆదేశించింది. పనితీరుపై సమీక్ష, కొత్త చర్యలపై చర్చ, అడ్డంకుల పరిష్కారం కోసం ప్రతినెలా సమావేశం కావాలని ఆదేశించింది. మంత్రుల బృందం ఎప్పటికప్పుడూ ప్రభుత్వానికి సలహాలు, నివేదికలు, సిఫార్సులు చేయాలని ఆజ్ఞాపించింది. ఈ మేరకు తదుపరి చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖకు ఏపీ సీఎస్ కె.విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు.
Also Read : Fake Liquor Case: నకిలీ మద్యం కేసు కీలక సూత్ర దారి జోగి రమేష్
