Sabarimala: ఆదాయం లేని వ్యక్తి శబరిమల బంగారు తాపడం దాత ?
ఆదాయం లేని వ్యక్తి శబరిమల బంగారు తాపడం దాత ?
Sabarimala : శబరిమల ఆలయంలో బంగారు ఫలకాల బరువు తగ్గిపోవడంపై తలెత్తిన వివాదంలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గర్భగుడి వెలుపలి బంగారు ఫలకాలకు తాపడం దాత, బెంగళూరు వ్యాపారి ఉన్నికృష్ణన్కి (Unnikrishnan) అసలు స్థిరమైన ఆదాయ వనరులే లేవని, ఆయన అందించే దాతృత్వ సేవలకు, ఆదాయపు పన్ను శాఖ వద్ద ఉన్న వివరాలకు పొంతనే లేదని ట్రావన్కోర్ దేవస్థానం మండలి (టీడీబీ) విజిలెన్స్ విభాగం తన నివేదికలో పేర్కొంది. 2017-2025 మధ్య ఉన్నికృష్ణన్ సమర్పించిన ఆదాయపు పన్ను మదింపు పత్రాలను పరిశీలించి రూపొందించిన నివేదికను విజిలెన్స్ విభాగం కేరళ హైకోర్టుకు (Kerala High Court) అందజేసింది. ఈ నివేదిక ఆధారంగానే దర్యాప్తు కోసం సిట్ను న్యాయస్థానం నియమించింది. ‘2025-26 ఆర్థిక సంవత్సరంలో ఉన్నికృష్ణన్ బ్యాంకు ఖాతాలో రూ.10.85 లక్షల నగదు జమ అయ్యింది. ఈ మొత్తాన్ని కామాక్షి ఎంటర్ప్రైజెస్ సామాజిక సేవ కేటగిరీలో కేటాయించింది.
Sabarimala Gold
గర్భగుడి తలుపునకు మరమ్మతులు, బంగారు తాపడం పనులు చేయిస్తానని ఉన్నికృష్ణన్ ముందుకొచ్చారు. వాస్తవానికి ఈ ఖర్చుకు బళ్లారి వ్యాపారి గోవర్దన్ నిధులిచ్చారు. ద్వారబంధం కూడా తానే ఇచ్చానని ఉన్నికృష్ణన్ చెప్పుకున్నారు. అయితే, బెంగళూరు వ్యాపారి అజికుమార్ వాస్తవ దాత. ఈ ఏడాది వివిధ పూజలకు, అలంకరణలతో పాటు అన్నదాన మండపానికి రూ.10లక్షలు, అన్నదానానికి రూ.6లక్షలు ఉన్నికృష్ణన్ విరాళంగా అందించారు. 2017లో కూడా రూ.8.20 లక్షలతో పాటు 17 టన్నుల బియ్యం, 30 టన్నుల కూరగాయలు దేవాలయానికి అందజేశార’ని విజిలెన్స్ నివేదిక పేర్కొంది.
ద్వారపాలకుల ప్రతిమలతో పాటు బంగారు రేకులకు మరమ్మతులు, స్వర్ణ తాపడం పనులను 2019లో ఉన్నికృష్ణన్కు అప్పగించడం వెనుక దేవస్థానం అధికారులు, డిప్యూటీ కమిషనర్, టీడీబీ సభ్యుల హస్తం ఉందని ఆ నివేదిక అభిప్రాయపడింది. దీంతో ఉన్నికృష్ణన్ను తొలి ముద్దాయిగా, టీడీబీ అధికారులు పలువురిని నిందితులుగా సిట్ చేర్చింది. అయితే, పాలకమండలి ఎలాంటి తప్పిదాలకు పాల్పడలేదని 2019లో టీడీబీ అధ్యక్షుడిగా ఉన్న సీపీఎం నేత ఎ.పద్మకుమార్ తెలిపారు. నేరాన్ని తనపై మోపే యత్నాలు జరుగుతున్నాయని, దర్యాప్తులో సత్యమేమిటో త్వరలోనే వెల్లడవుతుందని పేర్కొన్నారు. కాగా, కేరళలోని అన్ని హిందూ ఆలయాల ఆస్తులు, వాటి నిర్వహణపై తనిఖీలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూడీఎఫ్ డిమాండ్ చేసింది.
Also Read : CM Mamata Banerjee: భూటాన్ వల్లే బెంగాల్ లో వరదలు – మమతా బెనర్జీ
