Cyclone Montha: ఏపీ వైపు దూసుకొస్తున్న ‘మొంథా’ తుపాను
ఏపీ వైపు దూసుకొస్తున్న ‘మొంథా’ తుపాను
Cyclone Montha : ఆంధ్రప్రదేశ్కి తుపాను ముప్పు పొంచి ఉంది. ఏపీ వైపు ‘మొంథా’ (Cyclone Montha) తుపాను దూసుకొస్తుంది. ఇది రాష్ట్రంలో తీరం దాటే అవకాశం ఉంది. దీనితో ఏపీకి వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. అక్టోబర్ 26, 27, 28, 29 తేదీల్లో తుపాను చాలా ప్రభావం చూపిస్తుందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ నెల 28న సాయంత్రం కాకినాడ సమీపంలో తీవ్రమైన తుపానుగా తీరం దాటే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఆ సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ ‘మొంథా’ (Cyclone Montha) ప్రభావం విశాఖపట్నం-తిరుపతి వరకూ ఉండనుంది. హైదరాబాద్ సహా తెలంగాణలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏపీలోని తీర ప్రాంత జిల్లాల్లో ఉన్న విద్యా సంస్థలకు 28, 29 తేదీల్లో సెలవు ప్రకటించాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. దూర ప్రాంతాలకు వెళ్లే వారు ప్రయాణాలు మానుకోవాలని పేర్కొన్నారు. భారీ వర్షాలు కురవనుండటంతో మచిలీపట్నం, దివిసీమ, విజయవాడ, గుంటూరు, ఏలూరు, గోదావరి జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Cyclone Montha in AP
ఆగ్నేయ బంగాళాఖాతంలో నెమ్మదిగా కదులుతూ వాయుగుండంగా క్రమక్రమంగా బలపడుతోంది. రేపటికి తీవ్ర వాయుగుండంగా బలపడి ఆ తరవాత తుఫాన్ గా రూపాంతరం చెందుతుందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఈ క్రమంలో.. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిషా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఇది బంగాళాఖాతంలో 27 నాటికి తీవ్ర తుఫాన్ మోంథాగా రూపాంతరం చెందనుంది. ఈ ప్రభావంతో గరిష్టంగా గంటకు 90-110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ హెచ్చరిస్తోంది. ప్రస్తుతం పోర్ట్ బ్లెయిర్కు పశ్చిమ-నైరుతి దిశలో 420 కి.మీ., విశాఖపట్నంకి పశ్చిమ-నైరుతి దిశలో 990 కి.మీ., చెన్నైకి తూర్పు-ఆగ్నేయంలో 990 కి.మీ., కాకినాడకి ఆగ్నేయంగా 1000 కి.మీ,. గోపాల్పూర్ దక్షిణ-ఆగ్నేయంలో 1040 కి.మీ. కొనసాగుతూ వాయుగుండంగా బలపడుతోంది. ఎల్లుండి ఉదయం నాటికి (27వ తేదీ) నైరుతి, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ-మధ్య బంగాళాఖాతం మీదుగా తుఫానుగా మారే అవకాశం కనిపిస్తోంది. ఈ తుపానుకు థాయ్లాండ్ సూచన మేరకు మోంథాగా(Cyclone Montha) నామకరణం చేసిన సంగతి తెలిసిందే.
ఉద్యోగులకు సెలవులు రద్దు
మోంథా తుఫాన్ హెచ్చరికలతో విశాఖ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఉద్యోగులకు సెలవులు రద్దు చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. వచ్చే మూడు రోజులు ఎంతో కీలకమని.. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లా, డివిజన్, మండల ,గ్రామ స్థాయి అధికార యంత్రాంగం హెడ్ క్వార్టర్స్ లోనే ఉండాలని.. ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనా ఎదుర్కోవడానికి అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలన్నారు.
వేటపై నిషేధం విధిస్తూ మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికీ సముద్రంలోకి వెళ్లి ఉంటే ఒడ్డుకు చేరుకోవడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అధికారులు రిలీఫ్ సెంటర్ల ఏర్పాటుకు సిద్ధంగా ఉండాలన్నారు. ‘‘చెట్లు పడిపోతే వెంటనే తొలగించడానికి ఏర్పాట్లు చేసుకోవాలి. త్రాగునీటికి ఇబ్బందులు రాకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు చేసుకోవాలి. విద్యుత్ సరఫరాకి అంతరాయం కలిగితే వెంటనే పునరుద్ధరించడానికి చర్యలు చేపట్టాలి.జనరేటర్లు,డీజిల్ అందుబాటు లో సిద్ధం గా ఉంచుకోవాలి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉంచాలి’’ అని అన్నారు. తుఫాను వల్ల భారీ వర్షాలు , పెనుగాలులు వచ్చే అవకాశం ఉన్నందున.. తీర ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని, పల్లపు ప్రాంతాల ప్రజలు నీటిని తరలించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు.
Also Read : Deputy Speaker: డీజీపీకు డిప్యూటీ స్పీకర్ రఘురామ ఫిర్యాదు
