Mumbai Hostage: పిల్లల నిర్బంధం ఘటనపై మరాఠీ నటి సంచలన పోస్ట్
పిల్లల నిర్బంధం ఘటనపై మరాఠీ నటి సంచలన పోస్ట్
Mumbai Hostage : మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని (Mumbai) ఓ యాక్టింగ్ స్టూడియోలో పట్టపగలే చిన్నారులను నిర్బంధించడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన పై తాజాగా మరాఠీ నటి రుచితా విజయ్ జాదవ్ స్పందిస్తూ సంచలన విషయాలు వెల్లడించారు. పిల్లలను బంధించడానికి రెండ్రోజుల ముందు తాను కూడా ఆ కిడ్నాపర్ రోహిత్ (Kidnaper Rohit) ఆర్యను కలవాల్సి ఉందని ఆమె తెలిపారు. అతడి బారిన పడకుండా తాను త్రుటిలో తప్పించుకున్నానని పేర్కొన్నారు. ఈ మేరకు ఇన్స్టాలో సుదీర్ఘ పోస్ట్ చేశారు.
Mumbai Hostage Sensational
‘‘కొద్ది రోజుల క్రితం రోహిత్ ఆర్య అనే వ్యక్తి ప్రొడ్యూసర్గా నాకు పరిచయమయ్యాడు. ఓ ఫిల్మ్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలన్నాడు. బంధించడం నేపథ్యంలో సినిమా తీయనున్నట్లు చెప్పాడు. దీంతో కథ వినేందుకు నేను అంగీకరించా. అక్టోబరు 23న అతడు నాకు మెసేజ్ చేసి కథ చెప్పేందుకు అపాయింట్మెంట్ కావాలని అడిగాడు. అక్టోబరు 28న కలుస్తానని చెప్పా. అక్టోబరు 27న పవయీ ప్రాంతంలోని తన ఆర్ఏ స్టూడియో అడ్రసు, లొకేషన్ను నాకు షేర్ చేశాడు.
‘‘అయితే, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ మీటింగ్ను నేను చివరి నిమిషంలో రద్దు చేసుకున్నా. ఈ ఉదయం నేను మీడియాలో అతడి గురించి వార్త చూడగానే వణికిపోయా. రెండు రోజుల క్రితం నేను కలవాల్సిన అదే వ్యక్తి.. ఇలా పిల్లలను బంధించాడని తెలిసి షాక్ అయ్యా. ఆ రోజు ఏదో శక్తి నన్ను కాపాడినట్లు అనిపిస్తోంది. అతడి బారిన పడకుండా నన్ను కాపాడిన భగవంతుడికి, మా కుటుంబసభ్యులకు ఎప్పటికీ రుణపడి ఉంటా. ఈ ఘటనతో నేనో విషయం తెలుసుకున్నా. కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకునేందుకు ముందు మనం చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఏం చేస్తున్నారనే విషయాలను కుటుంబసభ్యులతో పంచుకోండి’’ అని నటి రుచితా జాదవ్ రాసుకొచ్చారు.
పవయీ ప్రాంతంలోని ఆర్ఏ స్టూడియోలో గురువారం మధ్యాహ్నం ఆడిషన్స్ కోసం వచ్చిన పిల్లలను రోహిత్ ఆర్య (50) బంధించాడు. సమాచారం అందుకొన్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకోగా, అదే సమయంలో రోహిత్ సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో విడుదల చేశాడు. చర్చల కోసం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో పోలీసులు మొదటి అంతస్తులోని మరుగుదొడ్డి మార్గంలో నుంచి స్టూడియో లోపలికి ప్రవేశించి బందీలుగా ఉన్న పిల్లలను రక్షించారు. అది చూసిన రోహిత్ ఎయిర్గన్తో పిల్లలకు హాని తలపెట్టబోగా పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అతడు మరణించాడు.
Also Read : Mallikarjun Kharge: ఆర్ఎస్ఎస్ను నిషేధించాలి – మల్లికార్జున్ ఖర్గే
