Sricharani: సీఎం చంద్రబాబును కలిసిన మహిళా క్రికెటర్‌ శ్రీచరణి

సీఎం చంద్రబాబును కలిసిన మహిళా క్రికెటర్‌ శ్రీచరణి

 

 

భారత మహిళా క్రికెటర్‌ శ్రీచరణి, మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌.. క్యాంప్ కార్యాలయంలో ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. వీరికి మంత్రి నారా లోకేశ్‌ స్వాగతం పలికారు. ప్రపంచకప్‌ గెలిచినందుకు శ్రీచరణిని చంద్రబాబు, నారా లోకేశ్‌ అభినందించారు. వరల్డ్ కప్ గెలుచుకున్న ఆనంద క్షణాలను శ్రీచరణి వారితో పంచుకున్నారు. ప్రపంచకప్‌ గెలుచుకోవడం ద్వారా టీమ్‌ఇండియా జట్టు సత్తా చాటిందని… మహిళా క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారని సీఎం కొనియాడారు. అంతకుముందు గన్నవరం విమానాశ్రయంలో శ్రీచరణికి మంత్రులు అనిత, సవిత, సంధ్యారాణి, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని చిన్ని, కార్యదర్శి సానా సతీష్, శాప్ ఛైర్మన్ రవినాయుడు ఘన స్వాగతం పలికారు.

 

కాగా.. శుక్రవారం ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్ టీమ్ విన్నర్ శ్రీచరణికి ఘన స్వాగతం లభించింది. శ్రీచరణికి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కేశినేని చిన్ని, కార్యదర్శి సానా సతీష్, మంత్రులు అనిత, సవిత, సంధ్యారాణి, శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు విమానాశ్రయంలో స్వాగతం పలికారు. అనంతరం ఎంపీలు, మంత్రులు, శాప్ ఛైర్మన్ కలిసి శ్రీచరణి, మిథాలి రాజ్‌ను వెంటపెట్టుకుని సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. అయితే గన్నవరం నుంచి బెంజ్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించాలని ఏసీఏ మొదట భావించింది. ముఖ్యమంత్రితో భేటీ నేపథ్యంలో విజయోత్సవ ర్యాలీని రద్దు చేశారు. చంద్రబాబును కలిసిన తర్వాత మంగళగిరిలోని క్రికెట్ స్టేడియం‌ను సందర్శించేందుకు శ్రీచరణి బయలుదేరి వెళ్లారు. అలాగే.. సొంత జిల్లా కడపలో కూడా శ్రీచరణికి ఘన స్వాగతం లభించింది. ఆంధ్రక్రికెట్ అసోషియేషన్ సౌజన్యంతో జిల్లా క్రికెట్ అసోసియేషన్… శ్రీచరణిని ఘనంగా సత్కరించనుంది. ఆపై నగరంలో ఈరోజు సాయంత్రం శ్రీచరణితో భారీ ర్యాలీ నిర్వహించేందుకు జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఏర్పాట్లు చేసింది.

Leave A Reply

Your Email Id will not be published!