Red Fort Blast: దిల్లీ ఘటనలో కొత్త కోణం ! డిసెంబర్ 6న భారీ పేలుళ్లకు కుట్ర ?
దిల్లీ ఘటనలో కొత్త కోణం ! డిసెంబర్ 6న భారీ పేలుళ్లకు కుట్ర ?
Red Fort Blast : దిల్లీ ఎర్ర కోట సమీపంలో పేలుడుపై ముమ్మర దర్యాప్తు చేస్తున్న భద్రతా సంస్థలు.. అనేక కోణాల్లో సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలో మరో కీలక విషయం వెల్లడైంది. డిసెంబర్ 6న (బాబ్రీ మసీదు కూల్చివేత రోజు) భారీ పేలుళ్లకు ఉమర్ నబీ ప్రణాళిక రచించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఫరీదాబాద్ (Faridabad) కేంద్రంగా జైషే ఉగ్రవాద కార్యకలాపాలు నడిపిస్తున్నారన్న అనుమానాలతో అరెస్టు చేసిన ఎనిమిది మందిని విచారించడంతోపాటు, వారి కుటుంబీకులు, స్నేహితులు, పొరుగువారి నుంచి సేకరించిన వివరాలతో ఈ కుట్ర బహిర్గతం అయినట్లు పేర్కొన్నారు.
అధికారుల వివరాల ప్రకారం.. ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడే ఉమర్… చదువులో మాత్రం చురుకుగా ఉండేవాడట. ముజమ్మిల్తో కలిసి 2021లో తుర్కియేలో పర్యటించాడు. అదే అతడిలో తీవ్ర మార్పు తెచ్చిందని, ఉగ్ర కార్యకలాపాలవైపు మళ్లడానికి దారితీసిందని తెలిసింది. ఆ పర్యటన సమయంలోనే నిషేధిత జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ ప్రతినిధులతో వీరిద్దరు సమావేశమైనట్లు అధికారులు భావిస్తున్నారు. భారత్కు వచ్చిన అనంతరం ముజమ్మిల్తో కలిసి ఉమర్ పేలుడు పదార్థాలను సేకరించడం మొదలుపెట్టాడు. వాటిని అల్-ఫలాహ్ క్యాంపస్తోపాటు పరిసర ప్రాంతాల్లో నిల్వ చేశాడు. ఈ క్రమంలో డిసెంబర్ పేలుళ్ల ప్రణాళికను మిగతావారితో పంచుకున్న అతడు.. పేలుడు పదార్థాలను ఐ20 కారులోకి తీసుకువచ్చాడు. ఇంటర్నెట్లో చూసి వెహికల్-ఆధారిత ఐఈడీని (వీబీఐఈడీ) రూపొందించేందుకు ప్రయత్నాలు చేశాడు. అయితే, పేలుడు పదార్థం తయారీ పూర్తికాక ముందే అది పేలిపోయినట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.
Red Fort Blast – ఎర్రకోట పేలుడు ఘటనలో అల్-ఫలాహ్లో వైద్యుడు మిస్సింగ్ ?
ఫరీదాబాద్తో (Faridabad) సహా పలు ప్రాంతాల్లో 2900 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు… ఉగ్రవాద కుట్రను బహిర్గతం చేసినట్లు మీడియాలో చెప్పడాన్ని చూసి ఉమర్ భయపడిపోయినట్లు అధికారులు భావిస్తున్నారు. అయితే, అక్టోబర్ 26 కశ్మీర్కు వెళ్లిన ఉమర్.. స్నేహితులు, బంధువులతో కొంత సమయం గడిపాడు. ఆ సమయంలో వచ్చే మూడు నెలలపాటు తాను అందుబాటులో ఉండనని వారితో చెప్పినట్లు తెలిసింది. దీన్నిబట్టి చూస్తే వీబీఐఈడీని నిర్దేశిత ప్రదేశంలో పెట్టిన తర్వాత కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్లాలని ఉమర్ ప్రణాళిక వేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
జైషే మహ్మద్ ఉగ్ర సంస్థకు మద్దతుగా అక్టోబర్ 19న శ్రీనగర్లో (Srinagar) పోస్టర్లు అంటించిన కేసు ఈ మొత్తం దర్యాప్తునకు తొలి అడుగు అని చెప్పవచ్చు. ఆ కేసులో ముమ్మర దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముజమ్మిల్ను అరెస్టు చేశారు. ఈ పోస్టర్ల వ్యవహారంలో అతడితోపాటు మరి కొంతమంది పాల్గొన్నట్లు సీసీటీవీ దృశ్యాల్లో గుర్తించిన పోలీసులు.. దీని వెనుక ఉన్న అంతరాష్ట్ర ఉగ్ర నెట్వర్క్ను ఛేదించారు. ఈ క్రమంలో డాక్టర్ ముజమ్మిల్ అరెస్టు, అతడి రూమ్లో 360 కిలోల అమ్మోనియం నైట్రేట్ స్వాధీనం చేసుకోవడం తదితర పరిణామాలతో ఉమర్ భయపడిపోయినట్లు సమాచారం.
Also Read : PM Narendra Modi: దిల్లీ పేలుడు ఘటన బాధితులకు ప్రధాని మోదీ పరామర్శ
