Vruksha Maate: 114 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచిన వృక్షమాత తిమ్మక్క
114 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచిన వృక్షమాత తిమ్మక్క
వృక్షమాతగా గుర్తింపు పొందిన ‘సాలుమరద’ తిమ్మక్క (114) శుక్రవారం తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె… బెంగళూరు జయనగరలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారని ఆమె దత్తపుత్రుడు ఉమేశ్ వెల్లడించారు. వివాహమైన తర్వాత పాతికేళ్లయినా సంతానం లేకపోవడంతో మొక్కలనే బిడ్డలుగా భావించిన తిమ్మక్క… దశలవారీగా కుదూరు నుంచి హులికల్ వరకు 4.5 కి.మీ. పొడవునా 385 మర్రి మొక్కలను నాటారు. అవి భారీ వృక్షాలుగా ఎదిగాయి. దీంతో పాటు తమ గ్రామంలో వృక్ష ఉద్యానవనాన్ని ఏర్పాటు చేశారు. ఇలా ఆమె రాష్ట్రంలో 8 వేలకు పైగా మొక్కలు మహావృక్షాలుగా ఎదిగేందుకు శ్రమించారు.
వరుసగా (సాలు) చెట్లు (మర) పెంచుతూ వచ్చిన ఆమె… సాలుమరద తిమ్మక్కగా గుర్తింపు పొందారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ సహా కర్ణాటక రాజ్యోత్సవ పురస్కారం, కేంద్రీయ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ తో పాటు అనేక పురస్కారాలు అందుకున్నారు. ప్రభుత్వం ఆమెను పర్యావరణ రాయబారిగా (2022) నియమించి, మంత్రివర్గ హోదాను కేటాయించింది. అమెరికాలోనూ ఆమె పేరిట అధ్యయన సంస్థలున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పర్యావరణశాఖ మంత్రి ఈశ్వర ఖండ్రే తదితరులు తిమ్మక్క భౌతికకాయానికి నివాళి అర్పించారు. మాజీ ప్రధాని హెచ్.డి.దేవేగౌడ తదితరులు తిమ్మక్క మృతికి సంతాపాన్ని ప్రకటించారు.
తిమ్మక్క మృతి పట్ల పవన్ కళ్యాణ్ సంతాపం
వృక్షమాతగా గుర్తింపు పొందిన సాలుమరద తిమ్మక్క మృతిపై ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్ సంతాపం వ్యక్తం చేశారు. ‘‘కొందరు ఓ వైపు చెట్లను నరికి పర్యావరణానికి హాని చేస్తుంటే తిమ్మక్క లాంటి వాళ్లు పర్యావరణ పరిరక్షణకు జీవితాన్ని అంకితం చేసుకొన్నారు’’ అని కొనియాడారు.
