ముంబై : స్వదేశంలో న్యూజిలాండ్ తో వన్డే సీరీస్ ఆడనుంది భారత జట్టు. ఇందులో భాగంగా ముంబైలోని బీసీసీఐ కార్యాలయంలో కీలక సమావేశం జరిగింది. ఈ సందర్బంగా 15 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించింది బీసీసీఐ సెలెక్షన్ కమిటీ. దేశీవాళి క్రికెట్ లో భాగంగా జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో కొనసాగుతున్న మ్యాచ్ లలో కేరళ తరపున ఆడుతున్న సంజూ శాంసన్ దుమ్ము రేపుతున్నాడు. తాజాగా సెంచరీతో కదం తొక్కాడు. పరుగుల వరద పారించినా సెలెక్టర్లు పట్టించుకోక పోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సంజూ శాంసన్ ఫ్యాన్స్. మరో వైపు వికెట్ కీపర్ గా వన్డే ఫార్మాట్ లో ఎలాంటి ప్రతిభ కనబర్చక పోయినా రిషబ్ పంత్ తో పాటు శుభ్ మన్ గిల్ కు చోటు కల్పించారు.
కాగా కేరళ స్టార్ క్రికెటర్ పట్ల కొనసాగుతున్న వివక్షను ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు మాజీ క్రికెటర్లు. మరో వైపు సంజూ శాంసన్ తో పాటు బౌలింగ్ పరంగా అద్బుతంగా బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థుల గుండెల్లో బెంబేలెత్తిస్తూ వికెట్లు తీస్తున్న పశ్చిమ బెంగాల్ కు చెందిన స్టార్ బౌలర్ మహమ్మద్ షమీని సైతం పక్కన పెట్టడాన్ని తీవ్రంగా తప్పు పడుతున్నారు. ఎవరిని ఉద్దరించేందుకు వన్డే జట్టును ఎంపిక చేశారంటూ మండిపడుతున్నారు. కనీసం భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా నిర్వహించే టి20 వరల్డ్ కప్ లో నైనా సంజూ శాంసన్ ను ఆడిస్తారో లేదోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.
