స్త్రీ శ‌క్తి ప‌థ‌కం కింద 44.79 కోట్ల మంది ప్ర‌యాణం

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన మంత్రి రాం ప్ర‌సాద్ రెడ్డి

అమ‌రావ‌తి : ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. శాస‌న మండ‌లిలో ఎమ్మెల్సీలు కావలి గ్రీష్మ ప్రసాద్, తిరుమల నాయుడు, భూమి రెడ్డి రామగోపాల్ రెడ్డి స్త్రీ శక్తి పథకం పై అడిగిన ప్రశ్నల‌కు స‌మాధానం ఇచ్చారు. స్త్రీ శక్తి పథకం 15-08-2025 నుండి రాష్ట్ర వ్యాప్తంగా 3,400 రూట్లలో 7,896 ఏపీఎస్ఆర్టీసీ బస్సులకు చెందిన 5 కేటగిరీలలో అమలు చేస్తున్నామ‌ని చెప్పారు. 2 ఫిబ్ర‌వ‌రి నాటికి 44.79 కోట్ల మహిళా ప్రయాణికులు పథకం ద్వారా ప్రయోజనం పొందారని వెల్ల‌డించారు రాం ప్ర‌సాద్ రెడ్డి. ఇప్పటి వరకు మొత్తం రూ.880 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. ఇదిలా ఉండ‌గా రద్దీని తగ్గించేందుకు కొత్త బస్సుల కొనుగోలు ప్రక్రియ ప్రారంభం చేసినట్లు వెల్లడించారు.

కేంద్ర ప్రభుత్వ PM e-Bus సేవా పథకం కింద 1,050 ఈ-సిటీ బస్సులు చేర్చనున్నామ‌ని తెలిపారు మంత్రి. అదనంగా 500 CNG బస్సులు కొనుగోలు చేయాలని ప్రణాళిక రూపొందించ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. మరో 500 డీజిల్ బస్సులను CNG బస్సులుగా మార్పు చేయనున్నట్లు స్ప‌ష్టం చేశారు. స్త్రీ శక్తి పథకం ప్రభుత్వానికి బరువు కాదు బాధ్యత అని మంత్రి స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో ఒక్క కొత్త బస్సు కూడా కొనలేదని గత ప్రభుత్వాన్ని విమర్శించారు. ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు కార్మికుల సమస్యలు పరిష్కరిస్తున్నాం అని తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని నూతన బస్సులు తీసుకువస్తాం అని హామీ ఇచ్చారు. స్త్రీ శక్తి పథకం వల్ల మహిళా ప్రయాణికుల శాతం గణనీయంగా పెరిగిందని చెప్పారు మండిప‌ల్లి రాం ప్ర‌సాద్ రెడ్డి. ప్రతి మహిళకు సగటున నెలకు రూ.2000 వరకు లాభం కలుగుతోందని వివరించారు.

Leave A Reply

Your Email Id will not be published!