కొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలు

శాసనసభలో ఉప ముఖ్యమంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్

అమ‌రావ‌తి : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జడ్పీ ఎన్నికలను విభజించిన జిల్లాల ప్రాతిపదికన నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్. ఇందుకు అనుగుణంగా కసరత్తు జరుగుతోందని పేర్కొన్నారు. పంచాయతీల పునర్విభజన పైనా న్యాయపరమైన అడ్డంకులు ఏవీ లేవని చెప్పారు. శాసనసభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ స్థానిక సంస్థల స్వావలంబనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానిక సంస్థలను బలోపేతం చేసే చర్యలను తీసుకున్నాం అని తెలిపారు. అలాగే రహదారుల విస్తరణ, ఇతర అభివృద్ధి కార్యక్రమాల కోసం చెట్లను తొలగించేటపుడు అక్కడ ఎలాంటి ప్రత్యామ్నాయం తీసుకు రావాలనే దానిపై పరిశీలన జరుపుతున్నాం అని పేర్కొన్నారు. పర్యావరణ ప్రేమికుడిగా ఈ విషయంలో అన్ని వైపులా ఆలోచించి పచ్చదనాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకుంటాం అని చెప్పారు. కేవలం చర్యలు తీసుకోవడమే కాదు భవిష్యత్తులోనూ చెట్లను, వృక్షాలను సంరక్షించేలా బలమైన చట్టం తీసుకొచ్చేందుకు ఆలోచిస్తున్నాం అని చెప్పారు. ఇది కఠినంగా అమలు చేస్తేనే పచ్చదనానికి భరోసా దొరుకుతుందని అన్నారు.

అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కలను నాటుతున్నారు తప్పితే.. వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవడం లేదని సభ్యులు నా దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. పచ్చదనం సంరక్షణకు సభ్యుల నిశిత దృష్టిని అభినందిస్తున్నాన‌ని చెప్పారు. అదే విధంగా ఇక మీదట అటవీ శాఖ ఆధ్వర్యంలో పంపిణీ చేసే వాటికి, నాటే ప్రతి మొక్కకు జియో ట్యాగ్ వేసే ప్రక్రియ అమలు చేయాలని భావిస్తున్నాం అని తెలిపారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. నర్సరీల దగ్గర నుంచే దీనికి ప్రత్యేక వ్యవస్థను అమలు చేసేలా ఓ ప్రత్యేక వ్యవస్థను తీసుకువస్తాం అని ప్ర‌క‌టించారు. బెంగళూరు నర్సరీల్లో అమలు చేస్తున్న అత్యాధునిక విధానాలను పరిశీలిస్తున్నాం అని తెలిపారు. మొక్కలు నాటడమే కాదు వాటి సంరక్షణకు తగిన ప్రాధాన్యం ఇస్తాం అన్నారు డిప్యూటీ సీఎం. ఎర్ర చందనం అమ్మకం విషయంలో మెరుగైన ధరలను పరిశీలించేందుకు, గోదాముల్లో ఉన్న దుంగలను అమ్మకాలు చేసేందుకు ఓ ప్రత్యేక బృందాన్ని నియమించామ‌ని చెప్పారు . వారు ఎప్పటికప్పుడు గ్లోబల్ ధరలకు అనుగుణంగా దుంగలకు వేలం నిర్వహిస్తూ ప్రభుత్వ ఖజానాకు మంచి ధరలు వచ్చేలా ప్రయత్నం చేస్తారని తెలిపారు.

Leave A Reply

Your Email Id will not be published!