అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పెట్టుబడులు రాబట్టడం ఆయా శాఖలకు సంబంధించిన అంశంగా కాకుండా… జిల్లా కలెక్టర్లు కూడా బాధ్యతగా తీసుకోవాలని ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు. ఈ మేరకు పెట్టుబడులు రాబట్టుకునేలా సమావేశాలు నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు. జిల్లాల్లో పెట్టబడులను రాబట్టేలా కలెక్టర్లు కమిట్మెంట్తో పెట్టుబడిదారులను అన్వేషించాలని, పెట్టుబడులు పెట్టేందుకు కన్విన్స్ చేసి ముందుకు వచ్చిన వారికి పూర్తిగా కో-ఆపరేట్ చేయాలంటూ 3C ఫార్మూలను సీఎం చంద్రబాబు నిర్దేశించారు. పెట్టుబడి, టూరిజం శాఖలపై జరిగిన చర్చలో సీఎం కీలకాంశాలు ప్రస్తావనకు వచ్చాయి.
ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులను వేగంగా గ్రౌండ్ అయ్యేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. పెట్టుబడులను ఆకర్షించేలా జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని అన్నారు. పెట్టుబడులు వస్తే… స్థానికంగా యువతకు ఉపాధి, ప్రజల తలసరి ఆదాయం పెరుగుతాయని చెప్పారు. విశాఖ, అమరావతి, తిరుపతి ప్రాంతాలను ఎకనామిక్ రీజియన్ డెవలప్మెంట్ పేరుతో అభివృద్ధి చేస్తున్నాం అన్నారు. విశాఖ రీజిజయన్ కు పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, అమరావతికి పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్, తిరుపతి రీజియన్ కు ముఖేష్ కుమార్ మీనా బాధ్యత వహిస్తారని వెల్లడించారు. రీజియన్ల వారీగా పరిశ్రమలు, పెట్టుబడులు, ఆయా ప్రాంతాల ఆర్థికాభివృద్ధి బాధ్యతను ఈ అధికారులు తీసుకుంటారని ప్రకటించారు.
పెట్టుబడులపై ఎప్పటికప్పుడు కలెక్టర్లు సమీక్షించి ప్రాజెక్టులు గ్రౌండ్ అయ్యేందుకు తక్షణం చర్యలు చేపట్టాలి. అనుమతులు వేగంగా ఇవ్వటంతో పాటు భూ కేటాయింపులు కూడా యుద్ధ ప్రాతిపదికన జరిగేలా చూడాలన్నారు. పరిశ్రమలకు నీటిని ఇస్తేనే వేగంగా ఉత్పాదన ప్రారంభిస్తారని అన్నారు.
