అమరావతి : ప్రభుత్వంలోని అన్ని విభాగాలు ప్రజా కోణంలోనే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని, జరుగుతోన్న ప్రగతికి సహకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ముఖ్యంగా అటవీ శాఖ పనితీరు పీపుల్స్ ఫ్రెండ్లీగా మరింతగా మారాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇక జూనియర్ ఐఏఎస్లకు హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చేలా సీనియర్లు సహకరించాలని దిశా నిర్దేశం చేశారు. రాష్ట్ర సచివాలయంలో పలు కీలక అంశాలపై సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఏఐ సాయంతో వైద్య పరీక్షలు నిర్వహించే వ్యవస్థలను అందుబాటులోకి తీసుకు రావటం అభినందనీయం అన్నారు. తక్కువ వ్యయంతో పోర్టబుల్ గా ఉండేలా మెడ్ టెక్ టూల్స్ తయారు చేయాలని చెప్పారు. ఆర్టీఐహెచ్ ద్వారా మరిన్ని ఆవిష్కరణల్ని చేసి ప్రజారోగ్యం కోసం వినియోగించాలని పేర్కొన్నారు.
రూట్, రోడ్ ఆప్టిమైజేషన్ కూడా చేసుకుని 108 అంబులెన్సులు త్వరితగతిన చేరుకునేలా చూడాలని స్పష్టం చేశారు. మారుమూల ప్రాంతాల్లో ఉండే వ్యక్తులను కూడా అతి తక్కువ టైమ్ లో 108 చేరుకోవాలని అన్నారు. ఈసారి వేసవి ప్రభావం ఎక్కువ ఉంటుందని అంచనాలు ఉన్నాయని తెలిపారు. వడగాలుల ప్రభావంపై ముందుగానే ప్రచారం చేపట్టాలని అన్నారు. వేసవిలో ప్రజలు సురక్షితంగా ఉండేలా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. పశువులకు నీటి తొట్టెలను పెద్ద ఎత్తున నిర్మించాం అని తెలిపారు. ఆ తొట్టెల్లో నీళ్లు నింపేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల నిధుల నుంచి పశు భీమా పథకాన్ని కూడా సమర్ధంగా అమలు చేయాలని ఆదేశించారు సీఎం. ఎండలో పని చేసే ఉపాధి హామీ కూలీలకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇదే క్రమంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా నూతన ఆవిష్కరణలు రావాలన్నారు.
