ఏపీ పంచాయతీరాజ్ కు సీఎం చంద్రబాబు కంగ్రాట్స్
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు అభినందనల వెల్లువ
అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. కూటమి సర్కార్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రగతి పరుగులు తీస్తోందన్నారు. ఇందులో భాగంగా అన్ని రంగాలను మరింత బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టామన్నారు. ఇదిలా ఉండగా తాజాగా కేంద్ర సర్కార్ జాతీయ స్థాయి అవార్డులను ప్రకటించింది వివిధ శాఖలకు సంబంధించి. ఇందులో భాగంగా ఏపీ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు అవార్డులు వరించాయి. ఈ సందర్బంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. తనకు మరింత ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ కొణిదలకు శుభాకాంక్షలు తెలిపారు.
గ్రామాభివృద్ధే రాష్ట్రాభివృద్ధి అని బలంగా విశ్వసించే ప్రభుత్వంగా పల్లెల్లో వెలుగులు నింపుతున్నామని ముఖ్యమంత్రి అన్నారు. సుపరిపాలన, పేదరిక నిర్మూలన – జీవనోపాధి, మౌలిక సదుపాయాలు, ఉత్తమ మండలం, మహిళా స్నేహపూర్వక పంచాయతీ వంటి ఐదు అంశాల్లో వచ్చిన అవార్డులు 21 నెలల సుపరిపాలనకు అద్దం పడుతున్నాయని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. అత్యుత్తమ విధానాలు, సంస్కరణలతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖను ముందుకు నడిపిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి, ఆ శాఖ అధికారులకు, ఉద్యోగులకు సీఎం అభినందనలు తెలిపారు.గ్రామ స్వరాజ్య స్థాపనలో మరెన్నో విజయాలు అందుకోవాలని నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. ఇదే సమయంలో గతంలో వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని ఆరోపించారు సీఎం. తాము వచ్చాక అన్ని వ్యవస్థలను సరిదిద్దేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఇవే మంచి ఫలితాలు వచ్చేలా చేశాయన్నారు.
