న్యూఢిల్లీ : పార్లమెంట్ సాక్షిగా బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ను ఏకి పారేశారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. ఎవరి ప్రయోజనాల కోసం అమరావతిని రాజధాని చేస్తున్నారో సీఎం నారా చంద్రబాబు నాయుడు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. సీఎం రమేష్ బీజేపీ తరుపున రాజధాని కోసం మాట్లాడడం లేదన్నారు. ఆయన కేవలం తనకు రావాల్సిన , రాబోయే కాంట్రాక్టుల కోసం మాత్రమే ఉన్నాడని ఎద్దేవా చేశారు. ఏనాడైనా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రస్తావించాడా అని నిలదీశారు మిథున్ రెడ్డి. ఏపీ కూటమి సర్కార్ కొలువు తీరిన ఈ రెండేళ్ల కాలంలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారని ఆరోపించారు. ఇందు కోసమేనా మీకు మెజారిటీ కట్టబెట్టింది అని ఫైర్ అయ్యారు. బాధ్యత కలిగిన ప్రభుత్వం అత్యంత బాధ్యతా రాహిత్యంతో పాలనను కొనసాగిస్తోందని ధ్వజమెత్తారు. ఇది మంచి పద్దతి కాదన్నారు.
కేవలం వ్యాపార, వాణిజ్య ప్రయోజనాలను కాపాడేందుకే , తమ వారి భూముల ధరలకు రెక్కలు వచ్చేందుకే , తమ వారికి కట్టబెట్టేందుకే, లబ్ది చేకూర్చేందుకే చంద్రబాబు నాయుడు పదే పదే అమరావతి రాజధాని అంటున్నాడని ఆరోపించారు ఎంపీ మిథున్ రెడ్డి. రెండేళ్లలోనే రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని, అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని , కేవలం తమ సామాజిక వర్గానికి ప్రయోజనం చేకూర్చేలా నిర్ణయాలు తీసుకున్నారంటూ ఆరోపించారు . ఢిల్లీలో చదరపు గజానికి 4,000 ఖర్చుపెడుతున్నారని, మరో వైపు అమరావతిలో చదరపు గజానికి 12,000 రూపాయలకు పైగా ఖర్చు చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. అదనంగా ఖర్చు చేస్తున్న రూ. 8 వేలు ఎవరి జేబుల్లోకి వెళుతున్నాయో చెప్పాలని నిలదీశారు. అమరావతి పేరుతో ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
