తిరుమల : శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామి వారిని దర్శించుకుని, వాహన సేవలను ఆనందంగా తిలకించేలా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ సీవీఎస్వో మురళీకృష్ణ తెలిపారు. తిరుమల నాలుగు మాడ వీధులతోపాటు ఇతర ప్రాంతాల్లో చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లపై సీవీఎస్వో, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీవీఎస్వో మాట్లాడుతూ, గత బ్రహ్మోత్సవాల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి టీటీడీ విజిలెన్స్, పోలీస్ సిబ్బంది సమన్వయంతో పకడ్బందీ భద్రతా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాహన సేవలను తిలకించేలా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాల ధ్వజారోహణం రోజున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో పటిష్టమైన బందోబస్తు, బ్యారికేడింగ్ తదితర ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూలైన్లు, ప్రవేశ, నిష్క్రమణ మార్గాల్లో భద్రతా చర్యలు చేపడుతున్నామన్నారు. గరుడ సేవకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉన్నందున తిరుమల, తిరుపతిలోని పార్కింగ్ ప్రాంతాలను ముందుగానే పరిశీలించి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు సీవీఎస్వో వెల్లడించారు. అధిక సంఖ్యలో వాహనాలు వచ్చే నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు.
భక్తులకు సులభంగా మార్గనిర్దేశం చేసేందుకు తిరుమల, తిరుపతిలోని ముఖ్య కూడళ్లలో వివిధ భాషల్లో సైన్బోర్డులు, సూచిక బోర్డులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రణాళికాబద్ధంగా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. భక్తుల భద్రతతోపాటు క్రైమ్, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. టీటీడీ విజిలెన్స్, పోలీస్, ఫైర్, ఫారెస్టు, ఇంటెలిజెన్స్, ఆర్టీసీ, రైల్వే తదితర శాఖల సమన్వయంతో బ్రహ్మోత్సవాల సమయంలో భద్రత, ట్రాఫిక్ నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
