ముంబై : బీజేపీ మహిళా ర్యాలీ నిర్వహించడం , ట్రాఫిక్ జామ్ కావడంతో ఓ సామాన్య మహిళ రాష్ట్ర మంత్రి గిరీష్ మహాజన్ ను నిలదీసింది. అడ్డుకోబోయిన పోలీస్ ఆఫీసర్ ను ఏకి పారేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ సందర్బంగా బీజేపీ, మంత్రి నిర్వాకంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చిన తర్వాత మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు హర్షవర్ధన్ సప్కల్ ఆ క్లిప్ను షేర్ చేశారు. మహిళా రిజర్వేషన్లపై అధికార పార్టీ ప్రచారం దాని నిజ స్వరూపాన్ని బయట పెట్టిందని ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసం బీజేపీ మహిళలను తప్పుదారి పట్టిస్తోందని, ఒక ‘తప్పుడు కథనాన్ని’ ప్రచారం చేయడానికి ఈ అంశాన్ని ఒక సాధనంగా వాడుకుంటోందని ఆయన ఆరోపించారు.
రిజర్వేషన్ల ముసుగులో రాజ్యాంగ, ఎన్నికల ప్రక్రియలను మార్చాలన్న బీజేపీ ప్రయత్నాన్ని ప్రతిపక్ష కూటమి ఇప్పటికే అడ్డుకుందని అన్నారు. ఇప్పుడు ఆ కాషాయ పార్టీ ఈ అంశాన్ని మళ్లీ తెరపైకి తీసుకు రావడానికి ర్యాలీలు, ప్రచారాలకు పాల్పడుతోందని సప్కల్ ఆరోపించారు. మాజీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే కూడా ఈ వీడియోను పోస్ట్ చేశారు. బీజేపీ ఆడుతున్న నాటకాల కారణంగా సామాన్య పౌరులు వేధింపులకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఆ మహిళ వ్యక్తం చేసిన ఆగ్రహం ప్రజల్లో పెరుగుతున్న అసహనాన్ని ప్రతిబింబిస్తోందని ఆయన అన్నారు. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఉన్న మహిళలు కూడా ఇదే రీతిలో బీజేపీని తిరస్కరిస్తారని ఆయన ఉద్ఘాటించారు.
