హైదరాబాద్ : తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె పార్టీ ప్రకటించిన తర్వాత తొలిసారిగా మీట్ ది ప్రెస్ నిర్వహించారు హైదరాబాద్ లో. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. విద్య వైద్యం ఫ్రీగా ఇవ్వకుంటే రాళ్లతో కొట్టాలని పిలుపునిచ్చారు. తాము ఇచ్చిన పాంచజన్యంలో పేర్కొన్న ఐదు అంశాలను అమలు చేయకుంటే గన్ పార్క్ లోని అమరుల స్థూపం స్తంభానికి కట్టేసి కొట్టాలని సూచించారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. తన తండ్రి కేసీఆర్ తో తనకు పంచాయితీ లేదని బీఆర్ఎస్ అధ్యక్షుడిగానే ఆయననను విమర్శించానని చెప్పారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే తెలంగాణ ప్రజల కోసం తాను ముందుకే వెళ్తానన్నారు కల్వకుంట్ల కవిత.
తన టార్గెట్ సర్వోదయ తెలంగాణ సాధించడమేనని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలకు ఎవరైతే విలనో…తనకు కూడా వాళ్లే విలన్ అని చెప్పారు. కేసీఆర్ ను రాజకీయ నేతగానే విమర్శించానని తండ్రిగా ఆయనతో ఎలాంటి సమస్య లేదని చెప్పారు. తెలంగాణ రక్షణ సేన ప్రకటించిన పాంచజన్యం లోని ఐదు అంశాలు, ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాల విషయంలో తాను ఇచ్చిన మాట తప్పితే అమరవీరుల స్తూపం వద్ద స్తంభానికి కట్టేసి కొట్టాలని కల్వకుంట్ల కవిత ప్రకటించారు. అన్ని విషయాల్లో సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాతే హామీలు ఇచ్చానని చెప్పారు. గత 20 ఏళ్లుగా తనను చూస్తున్నారని ఇచ్చిన మాట, పట్టిన తోవను విడవకుండా ఉన్నానని అన్నారు.
