అమరావతి : ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు మహానాడు గురించి కీలక అంశాలు వెల్లడించారు. సర్వం సిద్దం చేశామన్నారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ విజయాలను మహానాడు వేదికగా ప్రజల ముందుంచుతామని మంత్రి తెలిపారు. రాబోయే మూడేళ్లలో రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం అనుసరించే దశ, దిశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివరిస్తారని చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే ప్రభుత్వం పనిచేస్తోందనే స్పష్టమైన సంకేతాన్ని మహానాడు ద్వారా రాష్ట్రానికి అందిస్తామని పేర్కొన్నారు. రైతులు, మహిళలు, యువత, కార్మికులు సహా అన్ని వర్గాలకు ప్రభుత్వం ఏం చేయబోతుందనే దానిపై స్పష్టమైన కార్యాచరణను వెల్లడిస్తామని చెప్పారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే గొడ్డలి పార్టీ విధ్వంసక రాజకీయాలను మహానాడు వేదికగా ప్రజాక్షేత్రంలో ఎండగడతామని మంత్రి ఘాటుగా విమర్శించారు. అభివృద్ధిని అడ్డుకోవడం, పెట్టుబడులను తరిమేయడం, యువత భవిష్యత్తును చీకటిలో నెట్టడం గత పాలకుల అసలు స్వరూపమని మండిపడ్డారు.
మహానాడు-2026ను మహోత్సవంలా నిర్వహించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు అపార ఉత్సాహంతో సిద్ధమయ్యారని మంత్రి తెలిపారు. ఇప్పటికే గ్రామగ్రామాన పసుపు జెండా రెపరెపలాడుతోందని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన క్లస్టర్ కేంద్రాలకు వేలాదిగా తరలివచ్చి మహానాడును విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు మంత్రి అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. మహానాడు అంటే కేవలం సభ కాదు… అది తెలుగు జాతి గర్వం… కార్యకర్త ఆత్మవిశ్వాస భవిష్యత్ ఆంధ్రప్రదేశ్కు బంగారు బాట వేయే మహా సంకల్పం అని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.