బెంగళూరు : కర్నాటకలో రాజకీయం అనుకున్నట్టుగానే మరింత వేడెక్కింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ఈ శనివారం లేదా ఆదివారం బాధ్యతలు చేపట్టే ఛాన్స్ ఉంది. పార్టీ నిర్ణయం మేరకు సీఎంగా ఉన్న సిద్దరామయ్య తన పదవికి రాజీనామా చేయనున్నారు. ఇందుకు గాను తాను గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు. ఇవాళ కాంగ్రెస్ ఎల్పీ సమావేశం నిర్వహించనున్నారు. అయితే ఒక వైపు ఈరోజు రాజీనామా సమర్పించడానికి సిద్ధరామయ్య గవర్నర్ అపాయింట్మెంట్ కోరగా గవర్నర్ ఆకస్మికంగా ముంబై వెళ్లారు.. ఈరోజు ఆయన వస్తారో రారో స్పష్టత లేదని కర్ణాటక కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
ఒకవేళ గవర్నర్ అందుబాటులో లేని పక్షంలో గవర్నర్ కార్యాలయం కార్యదర్శికి రాజీనామా లేఖ అంద చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అత్యంత కీలక సమయంలో ముందస్తు అపాయింట్మెంట్ కోరినప్పటికీ గవర్నర్ అందుబాటులో లేకుండా పోవడంపై కాంగ్రెస్ ముఖ్యులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ పెద్దలు కావాలనే ఇలా చేస్తున్నారని.. వారి ఆదేశాలకు అనుగుణంగానే గవర్నర్ అందుబాటులో ఉండకుండా ముంబై వెళ్లిపోయినట్లుగా వారు భావిస్తున్నారు. ఈరోజు రాజీనామా ప్రక్రియ పూర్తవుతే కానీ తదుపరి ప్రక్రియ సాఫీగా పూర్తవుతుంది.. లేదంటే సిద్ధరామయ్య రాజీనామాను గవర్నర్ ఆమోదించేవరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంటుంది.
