గుంటూరు జిల్లా : దివంగత ఎన్టీఆర్ ఆశయాల సాధనే లక్ష్యంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు పని చేస్తున్నారంటూ కితాబు ఇచ్చారు మంత్రి ఎస్. సవిత. మంగళగిరలోని తెలుగుదేశం పార్టీ హైబ్రీడ్ మహానాడు సందర్భంగా కార్యకర్తే అధినేత అంశంపై తీర్మానం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత , జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత మాట్లాడుడారు. తెలుగుజాతి కోసం… యువత కోసం… కార్మిక, కర్షకుల కోసం అన్న ఎన్టీఆర్ టీడీపీని స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చారన్నారు. ఆనాటి అగ్రవర్ణాల దురహంకారాన్ని నిలదీస్తూ… అణగారిన వర్గాలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించడం తప్పా..? అని నిలదీశారన్నారు. ఎన్.టి.ఆర్… అంటే మూడు అక్షరాలు మాత్రమే కాదు… బడుగు, బలహీన వర్గాలకు ఆత్మగౌరవాన్ని ఇచ్చిన మంత్రాక్షరాలు అని అన్నారు సవిత.
దేశానికి స్వాతంత్రం 1947లో వస్తే… రెండు తెలుగు రాష్ట్రాలకు అన్న ఎన్టీఆర్ రాకతో సంపూర్ణ స్వాతంత్రం వచ్చిందన్నారు. ఎన్టీఆర్ ఏ ఆశయాల కోసమైతే టీడీపీని స్థాపించారో అవే ఆశయాలను సీఎం చంద్రబాబు నాయుడు , పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ భుజానకెత్తుకుని పార్టీని మరింత బలంగా ముందుకు తీసుకెళుతున్నారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ కేవలం ఒక రాజకీయ పార్టీ కాదు… ఇది కోట్లాది మంది తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. కార్యకర్తే అధినేత అని నిరూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మరోసారి గర్వంగా చెప్పుకుంటున్నానని పేర్కొన్నారు.
