అమరావతి : గతంలో ఎన్నడూ లేనంతగా ఆక్వా రంగం సంక్షోభానికి గురి కాకుండా తమ సర్కార్ ప్రయత్నం చేసిందని, ఆసరాగా నిలిచిందని చెప్పారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. గతంలో 2019–24 మధ్య రూ.2,140 కోట్ల బడ్జెట్ కేటాయించి రూ.3,000 కోట్లు ఖర్చు చేశామన్న వైసీపీ ప్రచారం వాస్తవానికి విరుద్ధం అన్నారు. ఆ కాలంలో వాస్తవంగా రూ.1,475 కోట్లు మాత్రమే ఖర్చు చేసి రూ.7,700 కోట్లు ఖర్చు చేసినట్లు తప్పుడు గణాంకాలు చూపించారని ఆరోపణలు ఉన్నాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2025–26 బడ్జెట్లో రూ.300 కోట్లు కేటాయించినప్పటికీ రైతుల అవసరాల మేరకు సుమారు రూ.588 కోట్లు ఖర్చు చేసిందన్నారు. అదేవిధంగా ప్రస్తుత సంవత్సర బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించడంతో పాటు అవసరాన్ని బట్టి ఎంత ఖర్చు అయినా వెనుకాడమని స్పష్టం చేశారు.
ఆప్సడా చట్టంపై జగన్ చేస్తున్న వ్యాఖ్యలు వాస్తవ విరుద్ధం అని పేర్కొన్నారు అచ్చెన్నాయుడు. ఆ చట్టాన్ని ప్రకటించడమే కాకుండా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి కార్యరూపం తీసుకొచ్చి చట్టబద్ధత కల్పించిందన్నారు. వైసీపీ హయాంలో ఆక్వా రైతులకు ఆశించిన ప్రయోజనం చట్టం ద్వారా అందలేదని విమర్శలు ఉన్నాయన్నారు. అదే సమయంలో 2020లో ఫీడ్ ధర రూ.90 నుంచి 2022 నాటికి రూ.110.60కి పెరగడం రైతులపై భారం పెంచిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఫీడ్ ధరలను నియంత్రించి తగ్గించే చర్యలు తీసుకుందన్నారు. ప్రస్తుతం యుద్ధ ప్రభావం, ముడి పదార్థాల ధరలు 30–40% పెరుగుదల నేపథ్యంలో తయారీదారులు, రైతులతో సమావేశాలు నిర్వహించి ఆమోద యోగ్య స్థాయిలో ధరలు నిర్ణయిస్తోందని చెప్పారు. ప్రస్తుతం ఫీడ్ ధరలు 2022 స్థాయికి సమానంగా మాత్రమే ఉన్నాయని, అదనంగా పెరగలేదని స్పష్టం చేశారు.
