న్యూఢిల్లీ : ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యా శాఖ మంత్రిగా ఉండేదుకు అనర్హుడంటూ , తక్షణమే తనను తొలగించాలని డిమాండ్ చేస్తూ అభిజిత్ దీప్కే సారథ్యంలోని బొద్దింకల జనతా పార్టీ (సీజేపీ) శనివారం దేశ రాజధాని ఢిల్లీలో నిరసన చేపట్టారు. భారీ ఎత్తున మద్దతు లభించింది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ ఆందోళనకు బేషరతుగా మద్దతు పలికారు. ఈ సందర్భంగా మరాఠాకు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రోహిత్ పవార్ సంచలన ప్రకటన చేశారు. సీజేపీ నిరసనకు తాము కూడా మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించారు. కేంద్ర సర్కార్ ను ఏకి పారేశారు. యువతను నిర్లక్ష్యం చేస్తే ఏం జరుగుతుందో ఈ నిరసన ద్వారా తేట తెల్లమయ్యిందన్నారు.
కేంద్ర విధానాలు, కీలక పరీక్షల నిర్వహణలో లోపాలపై దేశ యువతలో పెరుగుతున్న అసహనానికి సీజేపీ పట్ల వ్యక్తమైన స్పందన అద్దం పడుతోందని రోహిత్ పవార్ అన్నారు. సీనియర్ రాజకీయ నాయకుడు శరద్ పవార్ మనవడు అయిన ఆయన ఉద్యమానికి తన పూర్తి మద్దతు ప్రకటించారు. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నీట్, సీబీఎస్ఈ పరీక్షల నిర్వహణలో పెద్ద ఎత్తున అక్రమాలు జరగడం, లక్షలాది మంది విద్యార్థులకు తీరని నష్టం ఏర్పడిందన్నారు. దీనికి పూర్తిగా బాధ్యత వహించాల్సింది కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అని ఆయన స్పష్టం చేశారు. ఈ ఆందోళనలో యువత అపూర్వ స్థాయిలో పాల్గొనడం వారిలో నెలకొన్న తీవ్ర అసంతృప్తిని సూచిస్తోందని అన్నారు.
