న్యూఢిల్లీ : కేంద్రంలోని ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన అమిత్ చంద్ర షా ఆపరేషన్ కంటిన్యూగా కొనసాగుతోంది. తాజాగా ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించింది మరాఠాకు చెందిన బాల్ ఠాక్రే శివసేన పార్టీ. ఈ ముఖ్యమైన సమావేశానికి ఆ పార్టీకి చెందిన ఆరుగురు పార్లమెంట్ సభ్యులు గైర్హాజర్ కావడం కలకలం రేపుతోంది. వీరంతా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే పార్టీలోకి జంప్ అవుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు శివసేన యుబిటి పార్టీ. ఇవాళ జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశానికి శివసేన (యుబిటి)కు చెందిన తొమ్మిది మంది లోక్సభ ఎంపీలలో ఆరుగురు హాజరు కాక పోవడంతో, ఆ పార్టీలో చీలిక రావడం ఖాయమని స్పష్టమవుతోంది. తద్వారా ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని అధికారిక శివసేన వర్గంలోకి వీరు అధికారికంగా చేరడం కేవలం సమయానుకూల విషయం మాత్రమేనని సంకేతాలు వెలువడుతున్నాయి.
ఈ సమావేశానికి సేన ఎంపీలు అరవింద్ సావంత్, అనిల్ దేశాయ్, రాజాభావు వాజేలతో పాటు పార్టీకి చెందిన ఏకైక రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ హాజరయ్యారు. మిగిలిన ఆరుగురు ఎంపీలు గైర్హాజరు కావడం పార్టీ పార్లమెంటరీ విభాగంలో చీలికను దాదాపు ధృవీకరించింది. సమావేశానికి హాజరుకాని ఎంపీలలో నాగేశ్ అష్టికర్, సంజయ్ దేశ్ముఖ్, సంజయ్ జాదవ్, సంజయ్ దినా పాటిల్, ఓంప్రకాష్ రాజెనింబాల్కర్ , భాసాహెబ్ వాక్చౌరే ఉన్నారు. అసమ్మతి ఎంపీలందరూ షిండే నేతృత్వంలోని సేనలో విలీనం కావాలని కోరుతూ ఒక లేఖపై సంతకాలు చేసి, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించినట్లు సమాచారం. అయితే, ఈ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు; ధృవీకరణ కోసం కొందరు ఎంపీలు స్వయంగా హాజరు కావాల్సి ఉంటుందని స్పీకర్ కార్యాలయం భావిస్తోందని, ఇది “రాబోయే రోజుల్లో జరుగుతుందని” భావిస్తున్నట్లు వర్గాలు తెలిపాయి.
