ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసేందుకు చంద్రబాబు కుట్ర
సంచలన ఆరోపణలు చేసిన ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల
విజయవాడ : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజా రవాణా పరంగా విశిష్ట సేవలు అందిస్తున్న ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేందుకు కుట్రకు తెర లేపారంటూ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై సంచలన ఆరోపణలు చేశారు. మంగళవారం షర్మిలా రెడ్డి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడల్లా ఆర్టీసీకి ముప్పేనని ఆవేదన చెందారు. సంస్తకు రాష్ట్ర వ్యాప్తంగా విలువైన ఆస్తులు ఉన్నాయని, ఇప్పుడు కూటమి సర్కార్ దానిపై కన్నేసిందని వాపోయారు. అందుకే వాటిని అమ్మేయాలని చూసేందుకు తెర వెనుక ప్రయత్నాలకు తెర లేపారంటూ మండిపడ్డారు షర్మిలా రెడ్డి. ప్రజా రవాణాను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే కుతంత్రాలకు చెక్ పెట్టక పోతే ప్రమాదం ఉందన్నారు.
నాడు అద్దె బస్సుల విధానం నుంచి నేడు ఈ బస్సుల ఎంట్రీ వరకు దానికి వెనుక స్కాంలు తప్ప సేవ చేయాలన్న తలంపు లేదన్నారు. సంస్థను ప్రైవేటీకరణ చేసేలా చంద్రబాబు చేయని ప్రయత్నాలంటూ లేవన్నారు. పేదవాడి రవాణా వ్యవస్థను అమ్మేవిధంగా కూటమి ప్రభుత్వ సైలెంట్ కిల్లింగ్ పాలసీలను తీసుకు వస్తోందని హెచ్చరించారు షర్మిలా రెడ్డి. దీనిని, ఈ నిర్ణయాలను, కుట్రలను తాము పూర్తిగా పార్టీ పరంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఆర్టీసీ అస్తిత్వాన్ని దెబ్బ తీయాలని చూస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఏపీఎస్ఆర్టీసీ జేఏసీ చేస్తున్న ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం అన్నారు. వాయు కాలుష్యం పేరిట RTC ని సమాధి చేయొద్దని కోరారు. సంస్థను అద్దెబస్సులకు అడ్డాగా మార్చొద్దని డిమాండ్ చేశారు.