పైరసీపై టెలిగ్రామ్ చర్యలు తీసుకోవాలి : కేంద్రం

15 రోజుల గ‌డువు విధించిన మోదీ ప్ర‌భుత్వం

న్యూఢిల్లీ : పైరేటెడ్ సినిమాలు, కాపీరైట్ ఉల్లంఘించే ఆడియో-విజువల్ కంటెంట్‌ను గుర్తించడం, నివేదించడం, వాటికి యాక్సెస్‌ను నిలిపి వేయడం , తొలగించడం వంటి వ్యవస్థలను బలోపేతం చేయాలని టెలిగ్రామ్ ప్లాట్ ఫామ్ ను ఆదేశించింది కేంద్ర స‌ర్కార్. తన ప్లాట్‌ఫారమ్ ద్వారా పైరేటెడ్ సినిమాలు, ఓటీటీ కంటెంట్ , ఇతర ఆడియో-విజువల్ మెటీరియల్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో సమాచార , ప్రసార మంత్రిత్వ శాఖ టెలిగ్రామ్‌కు నోటీసు జారీ చేసింది. అలాగే, పదేపదే ఉల్లంఘనలకు పాల్పడే ఛానెల్‌లు, గ్రూపులు, బాట్‌లు, ఖాతాలు, నిర్వాహకులు , సంబంధిత సంస్థలపై చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. నిర్మాతలు, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు , చట్ట అమలు సంస్థల కోసం టెలిగ్రామ్ కలిగి ఉన్న ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ వివరాలను మంత్రిత్వ శాఖ కోరింది. ప్లాట్‌ఫారమ్ నుండి పైరేటెడ్ కంటెంట్‌ను నిరోధించడానికి, గుర్తించడానికి , తొలగించడానికి తీసుకున్న చర్యలపై ‘చర్యల నివేదిక ను సమర్పించడానికి టెలిగ్రామ్‌కు 15 రోజుల గడువు ఇచ్చారు.

ఈ ఆదేశం, విడివిడిగా కంటెంట్‌ను తొలగించే పద్ధతి నుండి ప్లాట్‌ఫారమ్ బాధ్యతాయుతంగా వ్యవహరించే విధానానికి మారడాన్ని సూచిస్తోంది. పైరేటెడ్ కంటెంట్‌ను ప్రసారం చేస్తున్న 3,000కు పైగా టెలిగ్రామ్ ఛానెల్‌లపై ప్రభుత్వం గతంలోనే చర్యలు తీసుకుంది. ఒక మధ్యవర్తిగా ఐటీ చట్టం , ఐటీ నిబంధనల ప్రకారం తగిన జాగ్రత్తలు పాటించాల్సిన బాధ్యత టెలిగ్రామ్‌కు ఉందని గుర్తు చేశారు. ప్రతి పైరసీ ఛానెల్‌ను ప్రభుత్వం ఒక్కొక్కటిగా గుర్తించే వరకు టెలిగ్రామ్ వేచి ఉండకూడదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. IT చట్టం, 2000 , IT నిబంధనలు, 2021 ప్రకారం ప్లాట్‌ఫారమ్ పాటించాల్సిన ‘సముచిత బాధ్యతను నిరూపించు కోవడానికి, కేవలం సమస్య వచ్చినప్పుడు స్పందిస్తూ ఒక్కో ఛానెల్‌ను తొలగించే విధానం సరిపోకపోవచ్చు. కాపీరైట్ ఉల్లంఘన అనేది కేవలం సివిల్ పరమైన ఉల్లంఘన మాత్రమే కాదని, భారతదేశంలో కాపీరైట్ చట్టం, 1957 , సినిమాటోగ్రాఫ్ చట్టం, 1952 ప్రకారం అది ఒక నేరపూరిత చర్య అని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

Leave A Reply

Your Email Id will not be published!