అమరావతి : టూరిజంలో సరికొత్త విప్లవం చోటు చేసుకుందన్నారు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. మంగవారం ఆయన మీడియాతో మాట్లాడారు. భారతదేశపు తొలి ‘ఏఐ పవర్డ్ టూరిజం’ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రూపుదిద్దు కోనుందని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల నేతృత్వంలో స్వర్ణాంధ్ర విజన్-2047 దిశగా మరో చారిత్రాత్మక అడుగు వేశామన్నారు సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ , ఎక్స్ప్లర్జర్ మధ్య మూడేళ్ల వ్యూహాత్మక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఆంధ్రప్రదేశ్ వారసత్వ సంపదను ప్రపంచానికి చాటేలా సరికొత్త టెక్నాలజీ ని వాడుతున్నామన్నారు దుర్గేష్.. రాష్ట్ర వ్యాప్తంగా నివు ఏఐ (NiVU AI) విస్తరణ చేపట్టనున్నట్లు వెల్లడించారు. భారతదేశంలోనే తొలి ‘ఏఐ పవర్డ్ టూరిజం’ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారబోతోందని మంత్రి దుర్గేష్ కీలక ప్రకటన చేశారు.
రాష్ట్రంలోని 100కు పైగా పర్యాటక ప్రాంతాల్లో ‘నివు ఏఐ’ సేవలు కొనసాగుతున్నాయని చెప్పారు మంత్రి. ఇప్పటికే మంగళగిరిలో పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం అయ్యిందని చెప్పారు. వాయిస్ లేదా టెక్స్ట్ రూపంలో 130కు పైగా భాషల్లో హిస్టరీ చెప్పనుందని తెలిపారు. మంగళగిరి పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్తో ఏపీ వ్యాప్తంగా విస్తరించేలా చర్యలు చేపట్టామన్నారు. తొలి ఏడాదిలో 30 ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో అందుబాటులోకి ‘నివు ఏఐ’ రానుందని ప్రకటించారు కందుల దుర్గేష్. మూడేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేలా చేస్తామన్నారు. పర్యాటక ప్రాంతాల్లో ఇకపై క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు, మీ భాషలోనే పర్యాటక ప్రాంతాలు మాట్లాడతాయన్నారు.
యాప్ డౌన్లోడ్ల అవసరం లేదు.. పైసా ఖర్చు లేదు.. పర్యాటకుల కోసం ఉచితంగా నివు ఏఐ సేవలు లభిస్తాయని చెప్పారు కందుల దుర్గేష్. దేశంలోనే ఫస్ట్ టైమ్ అని పేర్కొన్నారు. ఏఐ టూరిజం స్టేట్గా మారబోతున్నది ఏపీ అని చెప్పారు. ‘నివు ఏఐ’ ని తెలుగులో స్వయంగా పరీక్షించాను.. ఎంతో ఖచ్చితత్వంతో, గౌరవంగా స్పందిస్తోందని అన్నారు.