అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో మహిళలకు తొలిసారిగా రిజర్వేషన్లు కల్పించిన ఘనత దివంగత ఎన్టీఆర్ కు, టీడీపీకి దక్కుతుందన్నారు. అందుకే మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ గురించి పెద్ద ఎత్తున చర్చిస్తున్నాం అన్నారు. టోటల్ ఫెర్టిలిటీ రేట్ మన రాష్ట్రంలోనూ పెరగాల్సి ఉంది. పొరుగుదేశాల్లో ఇది ఇంకా తక్కువగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి అభివృద్ధి అయినా జనాభా ఉంటేనే అది సార్ధకం అవుతుందని చెప్పారు సీఎం. మైక్రో ఫ్యామిలీల గురించి యువత ఆలోచన చేయటం ప్రమాదకరం అని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 40 దేశాల్లో జనాభా గణనీయంగా తగ్గిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. భారత్ లో దక్షిణాది రాష్ట్రాల పరిస్థితి కూడా అదేనని తెలిపారు. మన అభివృద్ధి సమతుల్యం కావాలంటే జనాభా నిర్వహణ చాలా కీలకం అని స్పష్టం చేశారు సీఎం.
అంగన్వాడీలు, పాఠశాలల్లోనూ చిన్నారుల సంఖ్య తగ్గుతోందని, వృద్ధుల సంఖ్య పెరుగుతోందని చెప్పారు. ప్రతీ వంద మంది జనాభాలో 89 శాతం మందికి మొదటి, రెండో సంతానం లేదని గుర్తు చేశారు. ఏపీలోని విశాఖ లాంటి జిల్లాల్లోనూ ఫెర్టిలిటీ రేటు అతి తక్కువగా ఉందన్నారు. ఏపీ విస్తీర్ణంలో 7 స్థానంలో ఉన్నా పాపులేషన్ డెన్సిటీలో తక్కువ స్థాయిలో ఉన్నామని పేర్కొన్నారు చంద్రబాబు నాయుడు. పిల్లలే సంపద అనే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటోందని తెలిపారు. ఆర్ధిక ప్రగతి సాధించేలా రాష్ట్రంలో వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం అని చెప్పారు. మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తున్నాం అన్నారు. పీ4 ద్వారా పేదల జీవన ప్రమాణాలు పెంచుతున్నాం అనిపేర్కొన్నారు.
